250 పడకలకు వైద్యశాల అప్గ్రేడ్
భవన నిర్మాణానికి నిధులు మంజూరు
నూతన కలెక్టరేట్ వద్ద పదెకరాల స్థలం కేటాయింపు
కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు
స్పెషలిస్టు డాక్టర్ల నియామకానికి చర్యలు
కలెక్టర్ కృష్ణ ఆదిత్య వెల్లడి
శానిటేషన్ కాంట్రాక్టర్ను తొలగించాలని ఆదేశం
ములుగురూరల్, నవంబర్ 24 : ములుగు జిల్లా దవాఖానను 250 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఇందులో రూ.30 కోట్లు భవన నిర్మాణానికి, రూ.10 కోట్లు మౌలిక వసతుల ఏర్పాట్లకు కేటాయించిందని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. బుధవారం దవాఖానలో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వసతులు అందించేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేయాలని ఆసక్తి చూపే స్పెషలిస్టుల సేవలు గుర్తించి అడిషనల్ అలవెన్స్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానలో సానిటేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదశ్వర్ను కలెక్టర్ ఆదేశించారు. సెక్యూరిటీ గార్డుల సంఖ్యను పెంచి సీసీ కెమెరాల పర్యవేక్షించాలన్నారు.
నూతన కలెక్టరేట్ వద్ద 10 ఎకరాల స్థలం కేటాయింపు
జిల్లా దవాఖానను అప్గ్రేడ్ చేసినందున భవన నిర్మాణం కోసం నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా కారణంగా చనిపోయిన వారికి ప్రభుత్వం అందించే సహాయ సహకారాల్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 100 దరఖాస్తులు వచ్చాయని, వాటి వివరాలను పీహెచ్సీల వారీగా మెడికల్ ఆఫీసర్లు పరిశీలించాలన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి లేని మందులను ప్రైవేట్లో కొనుగోలు చేయాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిలో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కొవిడ్ సమయంలో వైద్యాధికారులు మెరుగైన సేవలందించారని అభినందించారు. పార్కింగ్ స్థలంలో వైద్యం కోసం వచ్చినవారు కాకుండా ఇతరులు వాహనాలు నిలిపితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య, ఏటూరునాగారం సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.