అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది
ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి
జీసీసీ రేషన్షాపు, అంగన్వాడీ కేంద్రం పరిశీలన
డీలర్, టీచర్కు షోకాజ్ నోటీసులు
కాళేశ్వరం, జనవరి 19 : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందాలి. అప్పుడే వారికి న్యాయం జరిగినట్టు అని ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. క్షేత్రపర్యటనలో భాగంగా బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో పర్యటించారు. ముందుగా కాళేశ్వర ముక్త్తీశ్వర స్వామి ఆలయానికి రాగా అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్వతీ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. కల్యాణ మండపంలో అర్చకులు అశీర్వచనం చేసి స్వామి వారి శేష వస్ర్తాలతో సన్మానించి చిత్రపటం అందజేశారు. అక్కడి నుంచి గ్రామంలో గిరిజన సహకర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్షాపును పరిశీలించారు. ఎన్ని బియ్యం వచ్చాయి ? ఎంత మందికి సరఫరా చేశారని అడిగారు. అందుకు వారు సమాధానం చెప్పకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు ఐదు కిలోల బియ్యం ఇస్తున్నారా? డీలర్ సరిగా షాపు తీస్తున్నాడా? అని అక్కడే ఉన్న లబ్ధిదారులను అడిగారు. అక్కడి నుంచి స్థానిక అంగన్వాడీ సెంటర్కు వెళ్లారు. అక్కడ టీచర్ లేకపోవడంతో అయాతో మాట్లాడారు. సెంటర్కు ఎంతమంది పిల్లలు వస్తున్నారని తెలుసుకున్నారు. సీడీపీవోతో మాట్లాడుతూ మహదేవపూర్ ప్రాజెక్టు పరిధిలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి ? మీరు నెలకు ఎన్ని సార్లు తనిఖీ చేస్తున్నారని అడిగారు. అంగన్వాడీ టీచర్కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భూపాలపల్లి జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. రేషన్బియ్యం వినియోగించని వారు తమ కార్డులను సరెండర్ చేసి, పేదవారికి ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. కొత్త రేషన్ కార్డులు, కార్డు మార్పిడి అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, సివిల్ సప్లయ్ డీఎం రాఘవేందర్, డీపీవో అశాలత, జీసీసీ మేనేజర్ హరిలాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడోవో శంకర్, ఎస్సై నరేశ్, ఎంపీపీ రాణీబాయి, ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత పాల్గొన్నారు.