హుజూరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమాల గడ్డ హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలుపు ముందే ఖరారైంది. ఆది నుంచీ అండగా నిలిచిన ఇక్కడి ప్రజానీకం మరోసారి కారుకే జైకొట్టేందుకు సిద్ధమైంది. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఎక్కడికెళ్లినా కులాలు, పార్టీలకతీతంగా మద్దతు తెలుపుతున్నది. ఊర్లకు ఊర్లు కదిలివస్తుండగా, గెల్లు విజయం ఖాయమని తెలుస్తున్నది. తాజాగా, టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశంలో అధినేత కేసీఆర్ మనమే గెలుస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేయగా, శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొన్నది. పోలింగ్ దగ్గరపడుతున్న వేళ అధినేత ప్రకటన జోష్నివ్వగా, ఇక ప్రచారం మరింత ఊపందుకోనున్నది.
రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం హుజూరాబాద్ నియోజకవర్గం. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇక్కడి ప్రజలు అండగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి అధినేత కేసీఆర్ వెంట నడిచారు. ఎన్నిక ఏదైనా ఆదరించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే అభిమానాన్ని చాటుతున్నారు. సర్పంచ్ నుంచి శాసససభ వరకు.. పరిషత్ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఎన్నికలోనూ గులాబీ పార్టీకి అత్యధిక మెజారిటీ కట్టబెడుతున్నారు. తాజాగా, ఉప ఎన్నిక వేళ కూడా ఇక్కడి ప్రజలు అభివృద్ధి, సంక్షేమం వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యమంలో, ప్రభుత్వంలో చెప్పిన ప్రతి మాటా నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఆసరా, కేసీఆర్కిట్, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, సాగునీరు, దళితబంధు.. ఇలా ఎన్నో పథకాలు తెచ్చిన కేసీఆర్తోనే తాముంటామని స్పష్టం చేస్తున్నారు. అందుకే, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎక్కడికి వెళ్లినా జై కొడుతున్నారు. కులాలు, పార్టీలకతీతంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర పురోగతిని, కండ్ల ముందు అభివృద్ధిని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. ఆస్తులను కాపాడుకునేందుకు అర్ధంతరంగా రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లిన నేతపై మండిపడుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, పెరుగుతున్న పెట్రో ధరలపై ఒక్కమాట మాట్లాడకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. పదే పదే ఆత్మగౌరవమని చెప్పే రాజేందర్.. సీఎం నాలుగు వేల ఇండ్లు ఇస్తే ఒక్క ఇల్లూ ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తున్నారు.
అధినేత విశ్వాసంతో శ్రేణుల్లో ధీమా..
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో మనమే గెలుస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు మరోసారి టీఆర్ఎస్కు మద్దతివ్వాలనే నిర్ణయంతో ఉన్నారన్నారు. అధినేత ప్రకటనతో నేతలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే టీఆర్ఎస్ గెలుపుబాటలో పయనిస్తున్నదని, ప్రస్తుతం పూర్తి ఆధిక్యతతో ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. హుజూరాబాద్లోని ప్రతి ఓటరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని చెబుతున్నారు.