ములుగు నుంచి 9 మంది రాక
వైల్డ్లైఫ్ ప్రాజెక్టులో భాగంగా పెంచికల్పేట్ అటవీ ప్రాంతం పరిశీలన
నైపుణ్య మెళకువలే లక్ష్యంగా ముందుకు..
పెంచికల్పేట్ , సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హరితహారం పేరుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొక్కల పెంపకమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్ పులుల సంతతి అభివృద్ధికి పేరుగాంచింది. ఈ ప్రాంతాన్ని ములుగు అటవీ కళాశాలకు చెందిన, నాలుగో సంవత్సరం చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులు వైల్డ్లైఫ్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సందర్శించారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుండగా.. పెంచికల్పేట్ రేంజ్ పరిధిలో మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. నందిగాం పావురాల గుట్ట, అక్కడి పొడుగు ముక్కు రాబంధులు, వాటి జీవనశైలి, గుండెపల్లి బేస్క్యాంప్, కొండెంగ లొద్ది, దుద్దలాయి, జలపాతాలు, పెద్దవాగు ప్రాణహిత పరీవాహక అటవీ ప్రాంతం, అడవుల పెంపకం, పులుల మనుగడ, ఆవాస ప్రాంతం, సీసీ కెమెరాల నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణ, పులుల దాడి సమయంలో తప్పించుకునే మెళకువలు, అడవుల్లో పెంచుతున్న గడ్డిక్షేత్రాలు, నీటి ఊట కుంటలు, అటవీ ప్రాంత గిరిజన ప్రజలకు కల్పించే అవగాహన సదస్సులు వంటి విషయాలపై విద్యార్థులకు ఎఫ్ఆర్వో వేణుగోపాల్ వివరించారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఎఫ్డీవో విజయ్కుమార్, ఎఫ్ఆర్వో వేణుగోపాల్, డీఆర్వీ వైల్డ్లైఫ్ రమాదేవి, ములుగు అటవీ కళాశాల విద్యార్థులు సాయిప్రియ, కిరణ్మాలి, స్పంజిత, ప్రణీత, సంవేద, మేఘన, సిరివెన్నెల, అమృత వర్షిణి, అపరాంజలి పాల్గొన్నారు.
ఆహ్లాదకరమైన రేంజ్.. పెంచికల్పేట్
పెంచికల్పేట్ రేంజ్లో దట్టమైన అడవులు న్నాయి. ప్రాణహిత పెద్దవాగు సంగమం, జలపాతాలు, గుండేపల్లి బేస్క్యాంప్, పావురాల గుట్ట, పొడుగుముక్కు రాబంధులు.. ఇలా అన్నీ చూశాం. అన్ని జిల్లాలు పర్యటించాం. అందులో నంబర్ వన్గా ఈ రేంజ్ ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తిరిగి వాతావరణాన్ని ఆస్వాదించాం. మేఘన
భిన్నమైన పంటలను ఎంపిక చేసుకోవాలి
కాగజ్నగర్ డివిజన్లో పులులు దాడులు చేస్తున్న విషయాన్ని మేము గమనించాం. దట్టంగా అటవీప్రాంతం ఉన్నందున పులుల సంతతి పెరగడం హర్షణీయం. రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తం పత్తి పండించడం ద్వారా గ్రామాల్లో పశువులకు మేత దొరకడం లేదు. అదే జొన్న, పెసర, కంది వంటి తృణధాన్యాలపై, భిన్నమైన పంటల ద్వారా రైతులకు లాభసాటిగా ఉంటుంది. వాటితో పాటు పశువులకు మేత దొరుకుతుంది. అడవి లోపల ప్రాంతానికి పశువులు వెళ్లకుండా ఉంటాయి.
ఐఎఫ్ఎస్ అవుతా..
ఫారెస్టు కాలేజ్ ఆఫ్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ ములుగు నుంచి క్షేత్రస్థాయి పర్యటన వైల్డ్ లైఫ్ ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చి పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో పూర్తిగా పర్యటించాం. వన్యప్రాణుల జీవనశైలి అద్భుతంగా ఉంది. నేను భవిష్యత్లో ఐఎఫ్ఎస్ అధికారిణి అయి దేశ అటవీ సంరక్షణ కోసం ప్రత్యేకంగా కృషిచేస్తా. – సంవేద
వన్యప్రాణుల సంరక్షణ అభినందనీయం
ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్న చర్యలు అద్భుతం. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం, కాగజ్నగర్ డివిజన్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అధికారులు ప్రత్యేక చొరవతో పులుల సంతతి అభివృద్ధి చెందింది. ప్రాంతంలో ప్రతి వన్యప్రాణిని చూడగలిగినం.