శ్రీవారి ఖజానాకు రూ.16.90లక్షల ఆదాయం
యాదాద్రి, నవంబర్ 13 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తజనుల సందడి నెలకొంది. కార్తిక రెండో శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామి దర్శనానికి గంటల కొద్ది క్యూ కట్టారు. భక్తులతో ఆలయ పురవీధులు కిటకిటలాడాయి. భక్తుల రద్దీతో పాటు ఆలయ పునర్నిర్నాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాలకు కొండపైకి అనుమతించలేదు. స్వామి వారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము 4గంటల నుంచి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకించి, సుప్రభాతం నిర్వహించిన అర్చకులు నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి సుదర్శన నారసింహ హోమంతో శ్రీవారిని కొలిచారు. నిత్యతిరు కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కార్తికమాసం సందర్భంగా కొండకింద పాత గోశాల వద్ద గల వ్రత మండపంతో పాటు పాతగుట్ట ఆలయం వ్రత మండపంలో నిర్వహించిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించారు. తెల్లవారుజామూనే మహిళలు దీపారాధన గావించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ. 16,90,013 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.