నేరాలు, మోసాలపై పోలీసుల ఉక్కుపాదం
పెద్దపల్లిలో 59, మంచిర్యాలలో 43 కేసులు
ప్రధానంగా నకిలీ విత్తనాల విక్రయాలపై దృష్టి
ఎంతటివారినైనా ఉపేక్షించం : సీపీ సత్యనారాయణ
మంచిర్యాల, జూన్ 11( నమస్తే తెలంగాణ):పీడీ యాక్టు.. అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్నది. పోలీసుశాఖ ప్రత్యేక నిఘా పెట్టి పదే పదే మోసాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. ఈ మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈ ఐదేండ్లలో 102 మందిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) కేసులు పెట్టింది. నిన్నటి వరకు 99 నమోదుకాగా, శుక్రవారం బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న మరో ముగ్గురికీ నిర్బంధ ఉత్తర్వులు అందజేసింది. పెద్దపల్లి జోన్లో 59, మంచిర్యాల జోన్లో 43 కలుపుకొని ఆ సంఖ్య 102కు చేరింది. కాగా, ప్రధానంగా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్న సర్కారు ఆదేశాలతో ప్రత్యేక దృష్టి పెట్టింది.
రామగుండం కమిషనరేట్ పరిధిలో 2017 నుంచి ఇప్పటి వరకు పీడీ యాక్ట్ కింద 102 ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లు ఉండగా, నిన్నటి వరకు పెద్దపల్లి పరిధిలో 59, మంచిర్యాల పరిధిలో 40 కలుపుకొని 99 మందిపై పీడీ యాక్ట్ల కోసం ఆర్డర్లు జారీ చేశారు. శుక్రవారం తాజాగా ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో ఆ సంఖ్య 102కు చేరింది. నకిలీ కల్తీ విత్తనాలు అక్రమంగా సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని పత్తిరెడ్డి ప్రభాకర్, ఊస సుబ్బారావు, చౌదరి దినేష్లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు పెద్దపల్లిలో 59, మంచిర్యాలలో 43 మందిపై పీడీ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేశారు. 2017లో పెద్దపల్లి జోన్లో పీడీ కేసు కోసం ఒకరికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో పెద్దపల్లి జోన్లో 5, మంచిర్యాల జోన్లో 2 కలుపుకొని రామగుండం రీజియన్ పరిధిలో ఏడుగురికి పీడీ యాక్ట్ కింద ఆర్డర్లు జారీ చేశారు. 2019లో 27కుగాను పెద్దపల్లిలో 16, మంచిర్యాలలో 11 నమోదయ్యాయి. 2020లో 43 మందిపై జారీ కాగా, పెద్దపల్లిలో 27, మంచిర్యాలలో 16, ఈ యేడాది పెద్దపల్లిలో 10, మంచిర్యాలలో 11 కలుపుకొని మొత్తంగా 99 మందిపై పీడీ ఆక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో ప్రస్తుతం వాటి సంఖ్య 102కు చేరింది.
మోసాలకు అడ్డుకట్ట..
నేరం చేసే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు (పీడీ) అంటారు. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. దేశంలో పలు రకాల చట్టాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 1986లో ప్రివెంటివ్ డిటెన్షన్ ఆక్ట్ (పీడీ) యాక్టు వచ్చింది. 2018లో తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేస్తూ చట్టంగా తీసుకొచ్చింది. మరో 13 రకాల నేరాలను కూడా ఇందులో జోడించింది. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయం నేపథ్యంలో రాష్ట్రంలో ఇది విస్తృతంగా అమలులో ఉంది. ఈ యాక్టు కింద ఎఫ్ఐఆర్ నమోదు కాదు.. చార్జిషీట్ ఉండదు. ట్రయల్ నడుపరు. కోర్టు ఉండదు. జడ్జి ఉండరు. నేరపూరితంగా ఉన్న వ్యక్తుల మీద ఎక్కువగా దీనిని వాడుతుంటారు. ఏ లక్ష్యం కోసం, ఏ ఉద్దేశం కోసం పీడీ యాక్టును తీసుకొచ్చారో ఉద్దేశం నెరవేరాలంటే అవసరమైతే కఠినంగా వ్యవహరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రైతుల పాలిట బ్రహ్మాస్త్రం..
ప్రస్తుతం పీడీ యాక్టు రైతుల పాలిట బ్రహ్మాస్త్రంగా ఉంది. వారిని మోసం చేయాలని చూసేవారిపై పోలీసులు ఈ యాక్టు కింద ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు మొదటి నుంచీ అండగా ఉంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సడలింపు ఇచ్చారు. ధాన్యాన్ని తామే కొంటామని చెప్పి, ఎక్కడికక్కడ కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేశారు. కర్షకులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అటువంటి వారికి అన్యాయం చేయాలని, వారిని మోసం చేయాలని చూస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. నాసిరకం విత్తనాలు, నకలీ ఎరువులు, పురుగు మందులు అమ్ముతూ రైతులను నట్టేట ముంచాలని చూసేవారిపై అవసరమైతే పీడీ యాక్టు కూడా నమోదు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ సమన్వయంతో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ బృం దాలు పకడ్బందీగా పనిచేస్తున్నాయి.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
‘నకిలీ పత్తి విత్తనాల పట్టివేత’ శీర్షికన ఓ పత్రికలో ప్రచురితమైన కథనానికి మంచిర్యాల డీఈవో ఎస్ వెంకటేశ్వర్లు స్పందించారు. భీమిని మండలం ఎంపీపీఎస్ బొద్దుగూడ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ వీ సుబ్బారావు ఎస్జీటీని సస్పెండ్ చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపాల్ నగర్లో ఈ నెల 8న వ్యవసాయ అధికారుల సమక్షంలో చౌదరి, రావుల మహేందర్ ఇళ్లల్లో సోదాలు చేయగా 50 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు దొరికాయి. సరఫరాలో ప్రధాన నిందితుడైన భీమిని మం డలం మల్లిడికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. కాగా ఊస సుబ్బారావు నివాసం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం. అతడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. పీడీ యాక్టు ఉత్తర్వులను నిందితునికి శుక్రవారం అందజేశారు.
ఎంతటివారినైనా ఉపేక్షించం..
రైతుల కష్టాన్ని దోచుకునే అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించం. అందరిపైనా కేసులు నమోదు చేస్తాం. పీడీ యాక్టు కూడా అమలు చేస్తాం. వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. నకలీ దందా చేస్తున్న ప్రతి ఒక్కరిపైనా పీడీ యాక్టు అమలు చేశాం. కేసులు నమోదు చేసి, జైలుకు పంపినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడంలేదు. వారి జాబితా సిద్ధం చేశాం. సదరు వ్యక్తులపై త్వరలోనే పీడీ యాక్టు అమలు చేస్తాం.