అడవి తల్లికి హరితహారం
ఏటా మొక్కల పెంపకం.. ఏపుగా పెరిగి వృక్షాలుగా..
ఫలిస్తున్న విత్తన బంతుల (సీడ్ బాల్స్) ప్రయోగం
సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక శ్రద్ధ
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ) :అటవీ విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో స్మగ్లర్ల వేటుకు పలుచబడ్డ అడవులు.. నేడు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. యేటా వివిధ శాఖల ఆధ్వర్యంలో మొక్కల పెంపకం చేపడుతుండగా, ఏపుగా పెరిగి దట్టంగా మారుతున్నాయి. మరోవైపు విత్తన బంతుల ప్రయోగానికి శ్రీకారం చుట్టగా విజయవంతమైంది. ఖాళీ ప్రదేశాలు, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో సీడ్ బాల్స్ను వెదజల్లగా వృక్షాలుగా ఎదుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో అడవులకు పూర్వ వైభవం వస్తుండగా, ప్రకృతి ప్రేమికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అదవిఅడవుల విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నది. మానవాళి మనుగడకు, సమస్త జీవకోటికి 33 శాతం అడవులు ఉండాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోకపోవడంతో అడవుల విస్తీర్ణం 23 శాతానికి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ హరితహారం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలవంటి పథకాలతో వనాల పెంపుదలకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కలప స్మగ్లర్లు యథేచ్ఛగా అడవులను నరికివేయడంతో క్రమంగా పలుచబడ్డాయి. మరోవైపు అటవీ జంతువులకు రక్షణ కరువైంది. ఆహారం లభించక కోతులు రోడ్లపైకి రావడం ప్రారంభించాయి. సమీప గ్రామాల ప్రజలు అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ ఉపాధి పొందుతారు. అడవులు పలుచబడడంతో వారికి ఉపాధి సైతం కరువైంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతూ అడవులకు తిరిగి ప్రాణం పోస్తున్నది.
అడవులకు పూర్వవైభవం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భౌగోళిక విస్తీర్ణంలో 40 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. దట్టమైన అడవులతో పాటు కవ్వాల్ పులుల అభయారణ్యం, శివ్వారం మొసళ్ల అభయారణ్యం, ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం ఉంది. అడవులు పూర్వవైభవాన్ని సంతరింకునేందుకు హరితహారం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఏటా వానకాలంలో నిర్దేశిత లక్ష్యాల్లో సగం మొక్కలను అటవీ ప్రాంతాల్లో నాటుతున్నారు. బ్లాక్ ప్లాంటేషన్, ఖాళీ స్థలాలు, అడవుల సరిహద్దుల్లోని కందకాల్లో మొక్కలను పెంచుతున్నారు. టేకు, రావి, మర్రి, యాపలాంటి మొక్కలను నాటి వృక్షాలుగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కోతులకు ఆహారాన్ని ఇచ్చే పండ్ల మొక్కలను సైతం పెంచుతున్నారు. ఏడు విడుతల్లో 9 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల్లో నాటగా, ఏపుగా పెరిగి వృక్షాలుగా మారుతున్నాయి. అటవీ సంరక్షణలో భాగంగా అడవుల చుట్టూ కందకాలను తవ్వుతూ వాటిలో గచ్చకాయ మొక్కలను నాటడంతో అవి ఏపుగా పెరిగి కంచెగా మారుతున్నాయి. నాటిన మొక్కల సంరక్షణకు సైతం చర్యలు తీసుకుంటున్నారు. మొక్కల సంరక్షణలో భాగంగా అటవీ అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పచెబుతున్నారు. వారు క్రమంగా మొక్కలను సంరక్షించడంతో పాటు ఎండకాలంలో నీటిని పోస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని చెక్డ్యాంలను సైతం నిర్మించి మొక్కలను నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణను పటిష్టం చేసేందుకు బేస్ క్యాంపులు, చెక్ పోస్టులు సైతం ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లా విస్తీర్ణంలో లక్షా 76 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం (44 శాతం) విస్తరించి ఉంది. ఇందులో 60 శాతం దట్టమైన అడవులు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల సమన్వయంతో తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం చేపట్టారు. ఇతర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2020లో 67 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, 103 శాతంతో అధిగమించారు. 2020-21లో 311 నర్సరీలలో 40 లక్షల మొక్కలు పెంచి, నాటారు. 2021-22లో 40.28 లక్షల మొక్కల లక్ష్యంతో నిర్వహించారు. అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా 23,093 హెక్టార్లు లక్ష్యం కాగా, 5,691 హెక్టార్లలో మొక్కలు నాటారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలో 52 శాతం విస్తరించి ఉన్న అడవులను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా 4300.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, ఇందులో 2424 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటగా, ఏపుగా పెరుగుతున్నాయి. ఏడు విడుతల్లో సుమారు 4.52 కోట్ల మొక్కలు నాటగా, ఈ ఏడాది 52 లక్షల మొక్కలు నాటారు. ఇందులో సుమారు 70 నుంచి 80 శాతం వరకు బతికి మొక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫలిస్తున్న సీడ్ బాల్స్ ప్రయోగం..
హరితహారంలో భాగంగా 2017లో సీడ్ బాల్స్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆయా బీట్లలోని అటవీ సిబ్బంది సహకారంతో విత్తన బంతులు(సీడ్బాల్స్), సహజ విత్తనాలను సేకరించి అడవుల్లో చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. దట్టమైన అటవీప్రాంతాల్లో, ఎగుడుదిగుడు ప్రదేశాల్లో మొక్కలు నాటడం చాలా కష్టమవుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో సీడ్ బాల్స్ను వెదజల్లుతుంటారు. అటవీ ప్రాంతంలో పెరిగే జువ్వి, రావి, మేడి, మర్రి, సీతాఫలం, వేప గింజలు, చింతగింజలువంటివాటిని సీడ్ బాల్స్కు తయారు చేసి వెదజల్లారు. ఆసిఫాబాద్ డివిజన్లోని 51 అటవీ సెక్షన్లలో ఉన్న 156 బీట్లలో 30 బీట్లను సీడ్ బాల్స్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయా బీట్లలోని అటవీ సిబ్బంది సహకారంతో విత్తన బంతులు(సీడ్బాల్స్), సహజ విత్తనాలను సేకరించి అడవుల్లో చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. తిర్యాణి మండలం మోర్లీగూడ, ఆసిఫాబాద్ మండలం దంతన్పల్లి, కెరెమెరి రేంజ్ పరిధిలోని గూడమామడలలో పలుచబడిన అటవీ ప్రాంతాల్లో సుమారు 600 హెక్టార్లలో విత్తన బంతులను, విత్తనాలను నేరుగా చల్లారు. అలా చల్లిన విత్తనాలు సహజమైన వాతావరణంలో మొలకెత్తి, ఇప్పుడు వృక్షాలుగా ఎదుగుతున్నాయి.