నిరుపేద వర్గాల కోసమే కల్యాణలక్ష్మి
మేనమామలా సీఎం కేసీఆర్
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్లో 236 మందికి చెక్కుల పంపిణీ
మూడు తహసీల్దార్ కార్యాలయాలు ప్రారంభం
కరీంనగర్ కార్పొరేషన్, మే 10: రాష్ట్ర ప్రభు త్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని, వారి సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లోని ఆడిటోరియంలో 236 మందికి 2.34 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అందిస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూళ్లు తీసుకువచ్చారని చెప్పారు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీటితో పాటు 24 గంటల కరెంట్ను కూడా అందిస్తున్నారని వివరించారు. సంక్షేమ పథకాలతో పాటు అ భివృద్ధి పరంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉం డాలని ఆడబిడ్డలందరూ ఆశీర్వదించాలని కోరారు.
తహసీల్దార్ కార్యాలయాలు ప్రారంభం
కరీంనగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలను మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ప్రారంభించారు. కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణితో పాటుగా అన్ని రెవెన్యూ సేవలను ఈ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యాలయాలను ఆధునీకరించడంతో పాటు అన్ని సదుపాయాలు అందించే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఆర్డీవో ఆనంద్, ఎంపీపీ లక్ష్మయ్య, కార్పొరేటర్లు గందె మాధవి, ఐలేందర్ యాదవ్, నేతికుంట యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.