యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తిరుగులేని శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. అయితే పార్టీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాలకు, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు సరైన వేదికలంటూ లేవు. దీంతో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వారధిగా పార్టీ కార్యాలయాలు ఉండేలా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ తెలంగాణ భవన్ నిర్మాణాన్ని టీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా డిజైన్లో భవనాలను నిర్మిస్తుండగా.. ఇక్కడి భవనం సైతం సకల హంగులతో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. భవన నిర్మాణానికి అధిష్టానం రూ.60లక్షలు కేటాయించింది. కానీ.. అంచనా వ్యయం రూ.1.20కోట్లకు చేరడంతో మిగతా నిధులను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సొంతంగా వెచ్చిస్తున్నారు.
ఎకరం స్థలంలో ఆత్మగౌరవ సౌధం..
భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ – వరంగల్ హైవే పక్కనే ఎకరం స్థలంలో తెలంగాణ భవన్ను నిర్మిస్తున్నారు. భవన సముదాయాన్ని 8,352 చదరపు అడుగుల్లో నిర్మించారు. రెండేళ్ల క్రితం భవన నిర్మాణానికి భూమి పూజ చేయగా.. పనులను వేగవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పార్టీ కార్యాలయం గదులు, మొదటి అంతస్తులో మంత్రులు, వీఐపీల కోసం విశ్రాంతి గదుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీని పక్కనే సమావేశ మందిరం, వంట గది నిర్మాణం, స్టోర్ రూం, వాచ్మన్ క్వార్టర్లు, టాయిలెట్ల నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. విశాలమైన పార్కింగ్ను కూడా ఏర్పాటు చేశారు. భవనం ముందు భాగంలో, లోపల ఏర్పాటు చేసిన అందమైన పూల మొక్కలు, గార్డెనింగ్ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు సరైన వేదిక లేక పార్టీ కార్యక్రమాలు, సమావేశాలను ప్రైవేటు ఫంక్షన్హాళ్లలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపై ఏ కార్యక్రమం అయినా తెలంగాణ భవన్లోనే నిర్వహించుకునేలా సకల హంగులతో నిర్మించారు. ప్రస్తుతం మిగిలిపోయిన చిన్నచిన్న పనులను పూర్తి చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు.
అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే..
పార్టీ పరంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలను ఇకపై తెలంగాణ భవన్ నుంచే చేపట్టనున్నారు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తుండడంతో టీఆర్ఎస్ పార్టీ వాడవాడలకు విస్తరించింది. సభ్యత్వ నమోదులోనూ అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా.. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, మండల కమిటీలతో గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ కన్పిస్తోంది. త్వరలోనే జిల్లా అధ్యక్షుడి నియామకాన్ని పార్టీ అధిష్టానం చేపట్టనుంది. అయితే పార్టీపరమైన విషయాలతోపాటు ప్రభుత్వపర అంశాలపై చర్చించేందుకు సరైన వేదిక లేకుండా పోయింది. నాయకులు సైతం కార్యకర్తలకు సరైన సమయంలో అందుబాటులో లేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక ఇబ్బందులన్నీ తెలంగాణ భవన్తో తీరనున్నాయి. భవనం అందుబాటులోకి వచ్చాక ఏ కార్యక్రమమైనా.. ఇక్కడి నుంచే మొదలు పెట్టనున్నారు.
సమావేశాలకు వేదిక
పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చించడానికి సరైన వేదిక ఇప్పటివరకు లేదు. భువనగిరిలో నిర్మిస్తున్న తెలంగాణ భవన్ అందుబాటులోకి వస్తే ఎంతో ప్రయోజకంగా ఉండనుంది. పార్టీ అంతర్గత సమావేశాలు, సమీక్షలకు చక్కని వేదికగా నిలుస్తుంది. భవనం పనులు పూర్తికావచ్చాయి. త్వరలోనే సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.