భువనగిరి కలెక్టరేట్/ఆలేరు టౌన్, డిసెంబర్7;చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఆరోగ్య సమస్యల నివారణ, మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నది. వీటితోపాటు ప్రాథమిక విద్యను పిల్లలకు అందిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాలు చాలావరకు పక్కా భవనాలు లేక అద్దె ఇండ్లల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అద్దె సమస్యలు తీర్చడంతోపాటు పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి మార్చేందుకు నిర్ణయించింది. దీంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
తగ్గనున్న భారం
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి తీసుకెళ్తే అద్దె భారం తప్పనుంది. విశాలమైన స్థలం అందుబాటులోకి రావడంతోపాటు చిన్నారులకు చదువు మెరుగుపడనున్నది. ఆటపాటలకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ టీచర్లతోపాటు పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
232 పక్కా భవనాల్లో..
జిల్లా వ్యాప్తంగా 901 అంగన్వాడీ కేంద్రాలకు గాను 844 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 57 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 232 పక్కా భవనాలు ఉండగా మిగతావి అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పక్కా భవనాల్లో 50,586 మంది పిల్లలు ఉన్నారు.