ఒక్కొక్కరిపై రూ. 3,457 ప్రీమియం చెల్లింపు
ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
కొత్తవారికీ అవకాశం.. మరింత పెరగనున్న సంఖ్య
ఈ మూడేళ్లలో 1,048 కుటుంబాలకు రూ.52.40 కోట్లు అందజేత
మంచిర్యాల, ఆగస్టు 7, నమస్తే తెలంగాణ :అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ‘రైతు బీమా’తో వారి కుటుంబాలకు భరోసానిస్తున్నది. ఒక్కొక్కరికీ రూ. 3,457 ప్రీమియం చెల్లిస్తూ, ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు అందించి అండగా నిలుస్తున్నది. ఈ పథకం ద్వారా మూడేళ్లలో వేలాది మందికి పరిహారం ఇవ్వగా, నాలుగో యేటా అమలుకూ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా, అర్హుల సంఖ్య మరింత పెరగనున్నది.
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. రైతు పక్షపాతి కేసీఆర్ సర్కారు అన్నదాతల ఆర్థిక ఎదుగుదలకు ఎంతోగానో కృషి చేస్తున్నది. పంట పెట్టుబడికి తిప్పలు లేకుండా సాయం అందిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వానకాలం, యాసంగి సీజన్లలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరాతో పాటు రైతుబంధు అందజేస్తున్నది. ఈ క్రమంలో రైతుబంధులో భాగంగా పాసుపుస్తకాలు ఉన్న 18 నుంచి 59 ఏండ్లలోపు వయసున్న రైతులందరికీ రైతు బీమా వర్తిస్తున్నది. ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎల్ఐసీ ద్వారా బీమా సాయం అందుతున్నది. సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 14న ప్రారంభించారు. నాటి నుంచి వేలాది మంది రైతు కుటుంబాలకు రూ.కోట్లలో సాయం అందజేసింది. ప్రభుత్వమే రైతులకు సంబంధించిన ప్రీమియం చెల్లిస్తున్నది. ఒక్కో రైతుకు ప్రభుత్వమే రూ.3,457 ప్రీమియం భరిస్తున్నది. ఇందులో రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా ఇప్పటికే రైతుబంధు పాసు పుస్తకాలు పొందిన రైతులందరికీ ఎస్ఐసీ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఒక్కసారి బీమా బాండు పొందిన రైతులు 59 ఏండ్ల వయస్సు వరకు నిబంధనల ప్రకారం పథకానికి అర్హులు. అయితే ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులతో పాటు కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ప్రభుత్వం యేటా అవకాశం కల్పిస్తున్నది. మృతి చెందిన రైతు కుటుంబంలో నామినీ బ్యాంకు ఖాతాలోనే ఈ సొమ్ము జమవుతుంది. ప్రభుత్వం నేరుగా రైతుల కుటుంబానికి సాయం అందజేస్తున్నది. కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు, ఇంతకుముందు రైతు బీమా చేసుకోని రైతులు ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ చేసుకునేందుకు అవకాశం ఉంది. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వినోద్ కోరారు. ఒకవేళ రైతు మృతి చెందితే బాధిత కుటుంబానికి సదరు బీమాకు సంబంధించిన రూ.5 లక్షల బీమాను అందజేస్తారు.
దరఖాస్తులకు అవకాశం
బృహత్తరమైన రైతు బీమా పథకానికి కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ యేడాది ప్రభుత్వం మరోసారి గడువు ఇచ్చింది. 2021-22 సంవత్సరంలో రైతు బీమా పాలసీ కోసం ఆధార్ కార్డులో వయసును ప్రామాణికంగా తీసుకొని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 14.08.1962 నుంచి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి. రైతు భూమి 03.08.2021లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. పాస్ పుస్తకమున్న రైతులు ఈ నెల 11వ తేదీ వరకు మండల వ్యవసాయ కార్యాలయాల్లో స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. పాస్ పుస్తకం, ఆధార్, నామినీ ఆధార్ జిరాక్స్ కాపీలను ఏఈవోలకు అందజేయాలి. రైతులకు ఎన్నిచోట్ల భూమి ఉన్నా ఒక్క గ్రామంలో మాత్రమే బీమా వర్తిస్తుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను ఏఈవోలు, ఏవోలు వ్యవసాయ శాఖ లాగిన్లో నమోదు చేస్తారు. రైతులు 11.08.2021లోపే దరఖాస్తులు ఇవ్వాలి. అప్పుడే వాళ్లవి ఆన్లైన్ చేసేందుకు వీలు అవుతుంది. జిల్లాలో 2018 నుంచి మూడేండ్లలో 2,26,514 మంది దరఖాస్తు చేసుకోగా, 1,048 మందికి రూ.52.40 కోట్లు బీమాగా సాయం అందింది. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పథకం వేలాది మంది రైతుల కుటుంబాల్లో వెలుగులను నింపుతున్నది.