గోదావరిఖని, మే 7: సింగరేణి కార్మికులకు సంబంధించి పలు సమస్యలపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ డైరెక్టర్ను కలిసి విన్నవించారు. ఈమేరకు హైదరాబాద్లోని సంస్థ డైరెక్టర్(పా) బలరాంను కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఓసీపీల్లో పని చేసే ఆపరేటర్లు, టెక్నీషియన్లు, ఇతర కార్మికులకు ప్లేడేలు తగ్గిస్తూ గుర్తింపు సంఘంతో సంప్రదించకుండానే ఏకపక్షంగా జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మెడికల్ అన్ఫిట్ కార్మికుల డిపెండెంట్లకు త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలని, అందులో దివ్యాంగుల డిపెండెంట్లకు 15 రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరినట్లు వివరించారు. అలాగే కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, అలాగే నిర్ధారణ పరీక్షలు కూడా అందరికీ నిర్వహించాలని కోరినట్లు వెంకట్రావ్ తెలిపారు. సింగరేణి దవాఖానలో ఆక్సిజన్ కొరత లేకుండా రామగుండంలో ప్లాంటు నిర్మించేందుకు చేస్తున్న ఏర్పాట్లు హర్షణీయమనీ, అలాగే రామకృష్ణాపూర్, కొత్తగూడెం ఏరియాల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.
వైద్యం అందించాలి
రామగిరి, మే 7 : సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఆర్జీ -3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య జీఎం ఏ మనోహర్కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. పని స్థలాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని, ఆరోగ్య పరిరక్షణకు తగిన శ్రద్ధ వహించాలని జీఎంకు విన్నవించారు.