మెహిదీపట్నం, డిసెంబర్ 4 : ఆరోగ్యకర ప్రయాణాన్ని అందించడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కోలుకుంటున్న ఆర్టీసీకి మళ్లీ ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా మారనున్న నేపథ్యంలో ముందస్తుగా అధికారులు బస్సుల్లో శానిటైజేషన్ పనులను చేపట్టారు. మెహిదీపట్నం ఆర్టీసీ డిపో, ప్రధాన బస్స్టాప్లు, బస్సు షెల్టర్లు, ప్రయాణికులు కూర్చునే బల్లలు, బారికేడ్లను శానిటైజ్ చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ సిబ్బంది సేవలు అందిస్తున్నారని మెహిదీపట్నం డిపో మేనేజర్ జి.వి.ఎస్.నారాయణ తెలిపారు.
ఆర్టీసీ డిపోలో అందరికీ వ్యాక్సిన్..
మెహిదీపట్నం డిపోలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తి అయ్యిందని డిపో మేనేజర్ జి.వి.ఎస్.నారాయణ తెలిపారు. డిపోలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారెజ్ సిబ్బంది, కార్యాలయ, భద్రత సిబ్బంది మొత్తం రెండో డోస్ తీసుకున్నారని చెప్పారు. ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఆర్టీసీ సిబ్బందికి సహకారాలు అందించాలని సూచించారు.
కరోనా కట్టడికి టీకా తప్పనిసరి..
చార్మినార్, డిసెంబర్ 4 : కరోనా కట్టడికి టీకా తప్పనిసరి తీసుకోవాలని మొఘల్పురా డివిజన్ మాజీ అధ్యక్షుడు గోపీనాథ్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ యాదవ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ రూపంలో వస్తున్న కరోనాను కట్టడి చేయాలంటే శాస్త్రవేత్తలు, వైద్యులు, ప్రభుత్వం తెలుపుతున్న ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. రెండు డోసుల టీకాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మొఘల్పురా డివిజన్ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ, ఆర్యోగ కార్యకర్తలు స్వరూప, కవిత, సునిత పాల్గొన్నారు.