విదేశీ టెక్నాలజీతో ఏర్పాటుకు చర్యలు
రూ. కోటితో సిద్ధమవుతున్న యంత్రాలు
నిమిషానికి 250 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి
100 మందికి అందించేందుకు అవకాశం
వేములవాడ, సెప్టెంబర్ 2: వేములవాడ ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రూ. కోటి వెచ్చించి విదేశీ టెక్నాలజీతో కూడిన ప్రాణవాయువు యంత్రాలను తెప్పించారు. జనరేటర్ బిగింపు పూర్తికాగా వార్డులకు సరఫరా పనులను వేగంగా చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు పూర్తయితే నిమిషానికి 250 లీటర్ల లిక్విడ్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ 100 మంది రోగులకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందివచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు చొరవతో రూ. 20 కోట్లతో ఏరియా దవాఖానను నిర్మించారు. ఇందులో అధునాతన సౌకర్యాలు కల్పించారు. అలాగే విదేశీ టెక్నాలజీతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జనరేటర్ను బిగించారు. రోగుల వార్డులకు సరఫరా పనులను వేగంగా చేపడుతున్నారు. సాధ్యమైనంత తొందరలో ఆక్సిజన్ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకువస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఇండో అమెరికా ఫౌండేషన్ సహకారంతో..
ఇండో అమెరికాఫౌండేషన్, సీఎస్ఆర్ సహకారంతో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు వేములవాడ ఏరియా దవాఖానలో అక్సిజన్ జనరేటర్ను ఏర్పాటుకు చేశారు. జర్మనీ టెకాల్నజీతో తయారైన ఈ యంత్రం గాలిలో ఉండే 20శాతం అక్సిజన్ను తీసుకొని 85 నుంచి 90 శాతం వరకు ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తుంది. సాధారణ గాలిని ప్రత్యేక పరికరాల ద్వారా సేకరించి తీవ్ర ఒత్తిడికి గురిచేసి అందులో తేమను తొలగిస్తుంది. దుమ్ము, ధూళిలేకుండా శుద్ధి చేస్తుంది. ఇలా 6, 7రకాల పరివర్తనాల అనంతరం ప్రాణవాయువును ట్యాంక్ ద్వారా ప్రత్యేక పైపులైన్ సహాయంతో రోగులవార్డుకు సరఫరా చేస్తారు.
రెండు రకాల యంత్రాలు…
వేములవాడ ఏరియా దవాఖానలో రెండు రకాల ప్రాణవాయువు యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే అక్సిజన్ జనరేటర్ యంత్రాన్ని బిగించారు. మరొకటి లిక్విడ్ అక్సిజన్ ట్యాంక్ను కూడా ఏర్పాటుచేయనున్నారు. లిక్విడ్ అక్సిజన్ ట్యాంక్లో లిక్విడ్ను నిల్వ చేసుకొని తద్వారా అవసరం మేరకు ప్రాణవాయువును తీసుకునే అవకాశం ఉంటుంది.
త్వరలోనే అందుబాటులోకి తెస్తాం..
అక్సిజన్ జనరేటర్ యంత్రం ఇప్పటికే బిగింపు పూర్తయింది. దవాఖానలోని వార్డులకు సరఫరా చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాం. లిక్విడ్ అక్సిజన్ ట్యాంక్ ఏర్పాటుకు స్థలం సిద్ధం చేశాం. ట్యాంక్ ఇంకా రావాల్సి ఉంది. రెండు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధ్యమైనంత తొందరలో సుమారు 100 మందికి అక్సిజన్ అందుబాటులోకి వస్తుంది.
-డాక్టర్ రేగులపాటి మహేశ్రావు, దవాఖాన సూపరిండెంట్ వేములవాడ