లబ్ధిదారుల జాబితా సిద్ధం
క్షుణ్ణంగా వివరాలు నమోదు
అర్హులకే దళితబంధు దక్కేలా చర్యలు
మేడ్చల్ జిల్లాలో చురుగ్గా పరిశీలన
నియోజకవర్గానికి 100 మందికి నిధులు జమ
మేడ్చల్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల పూర్తి వివరాలను ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, దళితబంధు అమలుకు ప్రత్యేకంగా నియమించిన అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో ఐదు వందల మంది లబ్ధిదారులకు రూ.50 కోట్లను వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా.. దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాలను మరోసారి పరిశీలించి సిద్ధం చేసిన జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..
వివరాల సేకరణ పూర్తయిన వెంటనే లబ్ధిదారులచే బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు. లబ్ధిదారులు ఖాతాల్లో రూ.10 లక్షల నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. దళితబంధు పొందిన లబ్ధిదారులు రూ. 10 లక్షల్లో 30 రకాల వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించింది.
అమలుకు పక్కా ప్రణాళిక
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు అమలుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నియమించిన ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో సర్వేను పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. పారదర్శకంగా ఎంపిక జరుగుతుందన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం దళిత బంధు కింద రూ.10 లక్షలను అందిస్తుందని కలెక్టర్ వివరించారు. అధికార యంత్రాంగం నిర్వహించే సర్వేలో ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
-హరీశ్, జిల్లా కలెక్టర్