మండు వేసవిలోనూ పుష్కలంగా నీళ్లు
మంత్రి కేటీఆర్ చొరవతో మినీ ట్యాంక్బండ్గా ముస్తాబు
పిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్కు
పక్కనే ఆహ్లాదంగా పల్లె ప్రకృతివనం
ఎల్లారెడ్డిపేటలో ముచ్చగొలుపుతున్న జలవనరు
ఎల్లారెడ్డిపేట, మే 31:ఎల్లారెడ్డిపేట గిద్ద చెరువు ముచ్చటగొలుపుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో పర్యాటక సొబగులద్దుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఒక నాడు చుక్కనీరు లేక అధ్వానంగా కనిపించిన చెరువు మిషన్కాకతీయతో పునర్జీవం పోసుకొని, 3 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్బండ్గా రూపుదిద్దుకున్నది. చెరువు వద్ద పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాల ఆట వస్తువులతో పార్కు, పక్కన తీరొక్క మొక్కలతో తీర్చిదిద్దిన పల్లె ప్రకృతి వనం ప్రకృతి ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నది.
వానకాలం వచ్చిందంటే అడుగంటిన నీటితో అధ్వానంగా కనిపించే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు ఇప్పుడు మండువేసవిలోనూ నీటితో కళకళలాడుతున్నది. ‘మిషన్కాకతీయ’ పనుల ఫలాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. మినీ ట్యాంకు బండ్ నిర్మాణ పనులు, చిల్డ్రన్ పార్కు, పల్లె ప్రకృతివనంతో ఓ సుందర దృశ్యంగా మారింది. కానీ, ఐదారేళ్ల క్రితం పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఎండాకాలం చుక్క నీరుండకపోయేది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారింది. మిషన్ కాకతీయ పథకంతో పూర్వ వైభవం సంతరించుకున్నది. 2015లో నేటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, నాటి కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ చేతుల మీదుగా 55.5లక్షలతో చెరువు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. పునరుద్ధరణ పనులు చేపట్టారు. పూడిక తీయించారు. కట్టను బలోపేతం చేశారు. దీంతో వానకాలం గట్టివానలు పడ్డా కట్ట చెక్కు చెదరలేదు. మత్తడి దుంకినా ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మండుటెండలున్నా ఇప్పటికీ చెరువు నీటితో కళకళలాడుతున్నది.
కొత్త సొబగులు..
గిద్ద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ప్రత్యేక చొరవ తీసుకొని 3కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. చెరువు వద్ద అర ఎకరంలో పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. అలాగే కట్టను ఆనుకుని పల్లె ప్రకృతి వనాన్ని సైతం నిర్మించారు. ఉదయం వాకింగ్ వెళ్లే వారికి, సాయంత్రం కుటుంబాలతో ఆహ్లాదం పొందేందుకు పల్లె ప్రకృతివనం, చిల్డ్రన్స్పార్క్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
కేటీఆర్ సహకారంతోనే..
మంత్రి కేటీఆర్ సహకారంతోనే గిద్ద చెరువును పునరుద్ధరించుకున్నాం. రాజీలేకుండా నాణ్యతతో పనులు చేయించాం. మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు మినీ ట్యాంకుబండ్గా తీర్చిదిద్దుతున్నాం. గిద్ద చెరువును ఓ టూరిస్ట్ స్పాట్గా మార్చుతున్న మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటాం.