రాంనగర్, ఏప్రిల్ 29: సీసీ కెమెరాలు భద్రతకు రక్షణ కవచంలా పనిచేస్తాయని సీపీ వీబీ కమలాసన్రెడ్డి పేర్కొన్నారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఖాన్పురా, హుస్సేనీపురా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 33 సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు జరిగిన సందర్భంలో సీసీ కెమెరాల పుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలు ఆధారాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాలు నిఘా నేత్రంలో ఉన్నట్లు తెలిపారు. ప్రతి దృశ్యం సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో ఎలాంటి ఘటనలు జరిగినా నిందితులు వెంటనే దొరుకుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లి గంట పాటు తిరిగి ఇంటికి వచ్చే సరికి 50 కెమెరాల్లో నిక్షిప్తం అవుతున్నట్లు తెలిపారు. మున్ముందు 200 కెమెరాల్లో నిక్షిప్తం అయ్యేలా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు జియోట్యాగింగ్ చేసి కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. అర్హులందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలకు విరాళాలు అందించిన దాతలను సీపీ సన్మానించారు. కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ డివిజన్ అడిషనల్ డీసీపీ అశోక్, వన్ టౌన్ ఏసీపీ విజయ్కుమార్, టూటౌన్, త్రీటౌన్ ఇన్స్పెక్టర్లు లక్ష్మణ్బాబు, విజ్ఞాన్రావు, కార్పొరేటర్ అబ్బాస్ సమీ, ఎస్ఐలు శ్రీనివాస్, అన్వర్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.