ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేపట్టాలి
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
కరోనా పరీక్షలు పెంచడంపై అధికారులకు ప్రశంసలు
జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సెల్ కాన్ఫరెన్స్
ఇందూరు, ఏప్రిల్ 25: కరోనా విజృంభిస్తున్నప్పటికీ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించడం అభినందనీయమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి సెల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రజలకు తెలిసేలా బెడ్స్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలన్నారు. ఈ వివరాలను సరి చూడడానికి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ఎవరైనా వివరాలను దాచి ఉంచితే దవాఖానల లైసెన్స్లు రద్దు చేయాలని ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు రెట్టింపు చేయడంపై అధికారులను ప్రశంసించారు. లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కొవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన బెడ్ల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జిల్లా అధికారులకు ఆదేశించారు. కలెక్టర్, పోలీసు కమిషనర్, మున్సిపల్ కమిషనర్, వైద్యారోగ్య శాఖ అధికారులతో కొవిడ్ విజృంభన, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై హైదరాబాద్ నుంచి ఆదివారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకవైపు తమతో పనిచేస్తున్న సిబ్బంది కొవిడ్ బారిన పడుతున్నప్పటికీ మిగతా సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని, వారి సేవలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కరోనాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని, ప్రజారోగ్యం కోసం ఎంత ఖర్చయినా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్లో ప్రతి రోజూ 2,625 మందికి కరోనా పరీక్షలు చేయడం లక్ష్యం కాగా డబుల్ పరీక్షలు చేస్తున్నారన్నారు. వ్యాక్సినేషన్ కూడా లక్ష్యానికి అనుగుణంగా జరుగుతుందని తెలిపారు.
కొవిడ్ బాధితులు బయటికి రావొద్దు..
కరోనా సోకిన వారు వీధుల్లో తిరగడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్య, పంచాయతీ రాజ్ అధికారులు కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల పేర్లను గ్రామ పంచాయతీలకు అందజేయాలన్నారు. కొవిడ్ బాధితులు ఇండ్లలోనే ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కరోనా బాధితులు వాడాల్సిన మందులు, జాబితాను ఒక ప్యాక్లో సిద్ధం చేసి మెడికల్ దుకాణాల్లో అందుబాటులో ఉండేవిధంగా చూడాలన్నారు. ఈ చర్యలతో జిల్లా మోడల్గా నిలిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని ఖలీల్వాడిలో వాడిన పీపీఈ కిట్లు, మాస్కులు ఇష్టం వచ్చినట్లు రోడ్లపై వేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని సేకరించడానికి ఒక టిప్పర్ను ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ మంత్రికి వివరించారు. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ కోరిన విధంగా సదుపాయాలు కల్పించడానికి టీఎస్ఎండీసీ ద్వారా ప్రయత్నం చేస్తానని, లేదంటే ఖరీదు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అత్యవసరం ఉన్నవారికే అందించాలని, వాటిని అవసరం మేరకు తెప్పించడానికి తాను చర్యలు తీసుకుంటానని చెప్పారు. దవాఖానల్లో అవసరం ఉన్న సిబ్బందిని ఔట్ సోర్సింగ్ కింద నియమించుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గతంలో 15 రోజులు వచ్చిన ఆక్సిజన్ ఇప్పుడు కొన్ని గంటల్లోనే అయిపోతుందన్నారు. ప్రస్తుతం ఆరు టన్నుల కెపాసిటీ ఉన్న బ్యాంకును 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచుకునేలా అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. సెల్ కాన్ఫరెన్స్లో నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ, డీఎంహెచ్వో బాలనరేంద్ర, వైద్యులు అన్నపూర్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.