దేవరుప్పుల, ఏప్రిల్ 29 : కరోనా తీవ్రత దృష్ట్యా గ్రామాల్లోనే ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంపీపీ బస్వ సావిత్రి, ఎంపీడీవో ఉమామహేశ్వర్తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. కరోనా బాధితులు పెరుగుతున్నందున కళాశాలను ఐసొలేషన్ వార్డుగా మార్చనున్నట్లు రంగాచారి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు మొదటి విడుతలో మండల కేంద్రాల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేస్తుండగా, ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంపిక చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే జూనియర్ కళాశాల ఉండడంతోపాటు కాంపౌండ్వాల్, నీటి వసతి, టాయిలెట్లు ఉండడం వల్ల దీనిని ఎంపిక చేశామని ఆయన వివరించారు. కరోనా బాధితులకు వైద్యు లు, ఆరోగ్య కార్యకర్తలు చికిత్స అందించడంతోపాటు ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. డీపీవో వెంట ఎంపీవో కవికుమార్, దేవరుప్పుల పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున స్వామి, కారోబార్ వెంకట్రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది బోనగిరి యాదగిరి ఉన్నారు.
నర్మెటలో ..
నర్మెట : మండల కేంద్రంలోని పీహెచ్సీలో గురువారం 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి మోజెస్రాజ్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి కిట్లు అందజేసి, హోం ఐసొలేషన్లోఉండాలని సూచించామని ఆయన పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూ చించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని మోజెస్రాజ్ కోరారు.
బచ్చన్నపేటలో ..
బచ్చన్నపేట : మండల కేంద్రంలోని పీహెచ్సీలో గురువారం డాక్టర్ కర్రె నవీన్కుమార్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మందికి పరీక్షలు చేయగా వీరిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇందులో కొడవటూరులో ఇద్దరికి, నాగిరెడ్డిపల్లి, ఆలింపూర్, బచ్చన్నపేట, జనగామకు చెందిన వారిలో ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చిందన్నారు. బాధితులను హోంఐసొలేషన్లో ఉండాలని సూచించినట్లు నవీన్కుమార్ తెలిపారు.
రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి : మండలంలోని కోమల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి మధుకర్యాదవ్ తెలిపారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్ రావడంతో మందులు అందజేసి హోం ఐసొలేషన్కు తరలించా మ ని చెప్పారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా నివారణ టీకాలు తీసుకోవాలని, స్వీయ నియం త్రణ పాటించాలని ఆయన కోరారు. జ్వరం, దగ్గు లక్షణా లు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
జఫర్గఢ్లో..
జఫర్గఢ్ : కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జఫర్గఢ్, కూనూరు ప్రభుత్వ దవాఖానల వైద్యాధికారులు రాజు, భజన్లాల్ కోరారు. గురువారం వారొక ప్రకటన చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని వారు తెలిపారు. జఫర్గఢ్ దవాఖానలో 15 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. కూనూరు పీహెచ్సీలో ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వ చ్చిందని వారు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, 45 యేండ్లు నిండిన వారు కరోనా నివారణ టీకాలు తీసుకోవాలని కోరారు.