అనాథగా మారిన ప్రియాంక
ఆపన్నహస్తం అందించాలని వేడుకోలు
పచ్చునూర్లో హృదయవిదారక ఘటన
కంటికి రెప్పలా చూసిన అమ్మ మూడేండ్ల కిందట కన్నుమూసింది.. తల్లిలేని బిడ్డను అన్నీ తానై పెంచుతున్న తండ్రి మొన్న అనారోగ్యంతో మరణించాడు.. తనకంటూ ఎవరూ లేని ఈ లోకంలో ఎలా బతికేదని అంటూ తండ్రి మృతదేహం వద్ద బిడ్డ కన్నీటి పర్యంతమైంది. తోడబుట్టిన వారు లేకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ తండ్రి చితికి నిప్పు పట్టింది. మానకొండూర్ మండలం పచ్చునూర్లో బుధవారం జరిగిన ఈ అమానవీయ ఘటన గ్రామస్తులను కలిచి వేసింది. డిగ్రీ చదువుతున్న పదిహేడేండ్ల ప్రియాంకకు దాతలు ఆపన్నహస్తం అందించాలని బంధుగణం వేడుకుంటున్నది..
మానకొండూర్ మండలంలోని పచ్చునూర్ గ్రామానికి చెందిన నేలవేని పూలమ్మ-లింగయ్యకు ఒకే ఒక కూతురు ప్రియాంక. నిరుపేదలైన వీరు కూలీనాలీ చేసుకుంటూ బిడ్డను ఉన్నంతలో బాగా చదివిస్తూ రంది లేకుండా బతుకుతున్నారు. సాఫీగా సాగుతున్న కుటుంబాన్ని విధి వెంటాడింది.. మూడేండ్ల క్రితం తీవ్ర అనారోగ్యంతో తల్లి పూలమ్మ మృతి చెం దింది. నాటి నుంచి తండ్రి లింగయ్య బిడ్డ బాగోగులు చూస్తున్నాడు. అప్పటి మానకొండూర్ ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి, దాతల సహకారంతో ప్రియాంకను చదివిస్తున్నాడు. ఇటీవల లింగయ్య మాయదారి రోగం బారినపడి మంచం పట్టాడు. పలు దవాఖానల్లో చికిత్స చేయించుకున్నా కుదుటపడలేదు.
ఈ క్రమంలో బుధవారం ఇంటివద్ద మరణించాడు. తండ్రి మృతదేహంపై పడి ‘ఇగ నాకు దిక్కెవరూ.. నేనెట్ల బతికేది’ అంటూ ప్రియాంక రోదించిన తీరు ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది. తోడబుట్టిన వారెవరూ లేకపోవడంతో ఉబికివస్తున్న కన్నీళ్లతో తానే దహన సంస్కారాలు పూర్తి చేసింది. కాగా, గ్రామస్తులే చందాలు పోగు చేసుకొని లింగయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రియాంకను దాతలు ముందుకువచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయాల్సిన వారు ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 970170 1405కు పంపించాలని వేడుకుంటున్నారు.