ఎన్నికల ప్రచారంలో విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 23: అచ్చంపేట మున్సిపాలిటీలోని 20వార్డుల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 3, 4, 5, 6, 7, 8, 9, 16, 17, 18 వార్డుల్లో విప్ గువ్వల ప్రచారం చేసి మాట్లాడారు. మరోసారి 20 వార్డులను క్లీన్ స్వీప్ చేసి రికార్డును తిరగరాస్తామన్నారు. మూడు నెలల్లోనే అర్హులైన వారందరికీ రేషన్కార్డులు, పింఛన్లు అందించే విధంగా కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఇండ్లు కట్టుకునేందుకు స్థలం ఉంటే ప్రభుత్వం నుంచి రూ.5లక్షల సహకారం అందజేస్తామన్నారు. పట్టణంలో మహిళా సమాఖ్య భవనాన్ని నిర్మిస్తామన్నారు. 30న నిర్వహించే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు దక్కకుండా టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు అనుసంధానంతో ఏదుల రిజర్వాయర్ నుంచి అచ్చంపేటకు సాగునీరు తీసుకొచ్చి ఉమామహేశ్వరుడి కాళ్లు కడుగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ‘గువ్వల’ బాలరాజు పేరింటేనే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో గుబులు పుడుతుందన్నారు. యురేనియం సర్వే, తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయించినట్లు గుర్తు చేశారు. 15ఏండ్లుగా నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటున్నానని స్పష్టం చేశారు. జీవితం, ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట ప్రజల కోసమేనన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు నర్సింహగౌడ్, శ్రీను, లావణ్య, సోమ్లానాయక్, మెహ్రజ్బేగం, ప్రియాంక, రమేశ్, మహమూదాబేగం, సృజన, శివ పాల్గొన్నారు.