హైదరాబాద్ : హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశిని.. శయని ఏకాదశి అని, హరి వాసరమని, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది.
ఆషాఢశుక్ల ఏకాదశి తిథిని ‘తొలి ఏకాదశి’గా జరుపుకొంటాం. ‘దేవశయని, హరిశయని, పద్మా ఏకాదశి’గానూ దీనిని పిలుస్తాం. కొన్ని సంప్రదాయాల వారు ఇవాళ్టినుంచే ‘చాతుర్మాస్య వ్రతాన్ని’ కూడా ఆచరించడం మరో విశేషం. ఈనాటినుండి విష్ణుమూర్తితోసహా ముక్కోటి దేవతలంతా శయనించటం వల్లే దీనికి ‘శయని ఏకాదశి’ అనే పేరు వచ్చింది. దేవతలంతా మేల్కొనే ‘ఉత్థాన ఏకాదశి’ (కార్తీకమాసం) వరకు వారిని యజ్ఞయాగాదులకు ఆహ్వానించడం వీలు కాదు. కనుక, ఈ మధ్య కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వర్తించబడవు.