అసురత్వం సవాలు విరిసింది. నేలతల్లిని సమూలంగా నీట ముంచింది. ‘తనను ఎదుర్కునే వీరుడు ఎవరు?’ అని విర్రవీగుతున్న రాక్షసత్వానికి విరుగుడు ఆ క్షణమే ప్రభవించింది. అహంకారంతో అవనిని ఆగం పట్టించిన వాడిని భీకర రూపంతో గదమాయించింది. ధరణిని నిలిపి, దుష్ట హిరణ్యాక్షుణ్ని తన కరాళ దంష్ట్రలతో కుళ్లగించిన రణ హుంకారం… ఆదివరాహ అవతారం.
‘వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా శశిని కళంకకలేవ నిమగ్నా కేశవ ధృత శూకరరూప జయ జగదీశ హరే!’ అని వైష్ణవ వాగ్గేయకారులలో ప్రముఖులైన శ్రీ జయదేవ గోస్వామి దశావతార స్తోత్రంలో వరాహ అవతారాన్ని కీర్తించారు. ‘శూకర రూపాన్ని ధరించిన ఓ కేశవా! ఓ జగదీశా! ఓ హరి! నీకు జయము జయము. గర్భోదక సముద్రములో మునిగి విశ్వపు అడుగు భాగానికి చేరిన ధరణి.. చంద్రుడిపై మచ్చలా నీ కొమ్ముదంతం అంచులో నిలబడి ఉన్నది’ అని వర్ణించారు.
ఇంతకీ విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఇవన్నీ ఊహాత్మక, ఉపమాన కథలుగా భావిస్తుంటారు. కొందరు వాటికి ఎలాంటి ఆధారాలూ లేవని, కాల్పనికాలనీ చెబుతుంటారు. కానీ, శ్రీమద్భాగవతం, ప్రామాణిక పూర్వాచార్యులు భగవంతుని అవతారాలను ఊహాత్మకంగా ఎన్నడూ పేర్కొనలేదు. అంతర్జాతీయ హరే కృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘వరాహ’ రూపాన్ని ఎందుకు స్వీకరించాడో ఇలా వివరించారు..
‘శ్రీ కృష్ణుడు వరాహమూర్తిగా అవతరించినంత మాత్రాన… వారు కష్టాలు అనుభవిస్తున్నారని అర్థం కాదు. వారికి ప్రతీదీ ఆనంద-చిన్మయ-రస-ప్రతిభావితాభిః’ (బ్రహ్మ సంహిత 5.37). కొన్నిసార్లు ఎంతో పెద్ద మనిషి కూడా గుర్రంగా మారుతుంటాడు. దీనిపై బ్రిటన్ ప్రధానమంత్రి గ్లాడ్స్టన్కు సంబంధించిన ఆసక్తికరమైన కథనం ఒకటుంది.. అవును! ఒకసారి గ్లాడ్స్టన్ ఇంటర్వ్యూ కోసం ఒకరు వచ్చారు. అక్కడున్న సేవకుడు ‘ప్రధాని ఇప్పుడు తీరిక లేకుండా ఉన్నారు. వేచి ఉండండి’ అన్నారు. గంట గడిచిపోయింది. ఇంకా ఎలాంటి సమాచారమూ రాలేదు. ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తి ఇంతసేపు ప్రధాని లోపల ఏం చేస్తున్నారో అనే కుతూహలం కొద్దీ తలుపు కొద్దిగా తెరిచి చూశారు. ఆ గదిలో ప్రధాని తన మనవడిని వీపు ఎక్కించుకొని గుర్రం ఆట ఆడటం చూసి అవాక్కయ్యాడు. ప్రధాని గుర్రం కాకపోయినా.. తన మనవడి కోసం అలా మారారు. అదేవిధంగా ‘కేశవ ధృత శూకర రూప’- అంటే భగవంతుడు కూడా ఒక సాధారణ వరాహం అని కాదు భావం! తన ఆనందం కోసం, జగత్తును రక్షించడం కోసం వరాహ రూపుడై అవతరించాడు.
భగవంతునివి కేవలం దశావతారాలు మాత్రమే కాదంటారు శ్రీల ప్రభుపాదులు. ‘భగవంతునికి వేలాది అవతారాలున్నాయి. ‘అద్వైతం అచ్యుతం అనాదిం అనంతరూపమ్’ (బ్రహ్మ సంహిత 5.33). ఎలాగైతే మనం ఒక నదిలోని తరంగాలను లెక్కించలేమో.. భగవంతుడి అవతారాలను కూడా అంచనావేయలేం. అవి నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. అవి నిత్య నూతనం, అనేకం. ఆ పరమపావన విష్ణు లీలలను శ్రవణం చేయడమే మానవ జన్మకు పరిపూర్ణత’ అంటారు ప్రభుపాదులు.
‘సృష్టి ఆరంభం నుంచి దేవతలు, దైత్యులు విశ్వంలోని లోకాలన్నిటినీ శాసించేవారు. విశ్వంలోని దేవతల్లో బ్రహ్మ ప్రథముడైతే, దైత్యుల్లో హిరణ్యాక్షుడు మొదటివాడు. భగవంతుడు ఏర్పరచిన సృష్టిలో కొన్ని నిర్దిష్ట నియమాల అనుసారమే వివిధ లోకాల్లోని గ్రహాలన్నీ అంతరిక్షంలో తేలాడుతున్నాయి. వాటి అంతర్నిర్మాణమే ఇందుకు కారణం. విశ్వంలోని సగ భాగం గర్భోదక జలాలతో నిండి ఉంటే, మిగిలిన సగం అసంఖ్యాకమైన గ్రహాలతో కూడి, లోకాలతో నిండి ఉన్నది. హిరణ్యాక్షుడు ఈ గ్రహాల కక్ష్య క్రమానికి విఘాతం ఏర్పర్చడంతో భూమి భారరహిత స్థితిని కోల్పోయి జలాల్లో పతనమైంది. ఆ సమయంలో జగత్తుకు స్థితికారుడైన భగవంతుడు శూకర రూపాన్ని ధరించి ఆవిర్భవించాడు. తన కొమ్ము దంతాలతో గర్భోదక జలంలోని భూమండలాన్ని ఎత్తి తిరిగి నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టాడు. ఆ సమయంలో తనను అడ్డగించిన హిరణ్యాక్షుణ్ని కొమ్ముదంతంతో గుచ్చి సంహరించాడు’ అని వివరించారు శ్రీల ప్రభుపాదులు.
భగవంతుని అవతార విశేషం ఇలాగే ఉంటుంది! అసాధారణ పరిస్థితుల్లో ఆయన అనువైన రూపంతో అవతరిస్తాడు. మనుష్యుని చింతనకు అందని పరమాద్భుత రీతిలో తన లీలలను ప్రదర్శిస్తాడు. ఆ లీలలను మళ్లీ మళ్లీ అంకితభావంతో శ్రవణం చేయడం ద్వారా భగవంతుని సాకార తత్వాన్ని తెలుసుకోగలం. మనం స్థిరచిత్తులై ఉండగలం. అలాంటి వైవిధ్య భరితమైన శ్రీకృష్ణుడి లీలల్లో పాలుపంచుకుంటే సకలం ఆనందమయం అవుతుంది. అదే జీవితానికి సార్థకత.
ప్రస్తుత కలియుగంలో భగవంతుడు ఈ లోకంలో అవతరించాడు! తన పవిత్ర నామ రూపంలో మన చెంతకు వచ్చాడు. ‘కలి కాలే నామ రూప కృష్ణ అవతార’ అని పరంపరాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు పవిత్ర నామాలతో కూడిన ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరేరామ హరేరామ రామ రామ హరే హరే॥’ మహామంత్రాన్ని ఉపదేశించారు. ఎవరైతే ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో వింటూ జపిస్తారో, వారు ఈ జన్మలోనే శ్రీహరి ప్రత్యక్షానుభూతిని పొందగలరు. ఆ భగవానుడు గరుడ వాహనంపై తరలివచ్చి భక్తులను భవసాగరం నుంచి రక్షిస్తాడు. అందుకే కృష్ణ చైతన్యవంతులమై వారి సేవలో తరించడమే మనం చేయాల్సింది. వివేకవంతుడైన వాడు భక్తి మార్గాన్ని అనుసరిస్తాడు. ముక్తి పథంలో పయనిస్తాడు. జీవన్ముక్తి పొందుతాడు.
– శ్రీమాన్ సత్యగౌరచంద్రదాస ప్రభూజి 93969 56984