Manidweepam | సమస్త భువనాలకు అవతల ఉండే సర్వలోకమది. సకల లోకాలూ ఆ సర్వలోక పరిధిలోనివే. అదే ‘మణిద్వీపం’. చుట్టూ అమృత సాగరం. సుధాజలధి తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తుంటాయి. వజ్రవైడూర్య మణిరత్నాదులు కలిగిన తీరం అమ్మవారి శోభను తెలియజేస్తుంటుంది. మందార కుందాది పుష్పాల పరిమళాలు వీస్తుంటాయి. కల్పవృక్షాదుల ఫలాలు పరవశింపజేస్తాయి.
వేదవేదాంత గోష్ఠులు ఒకవైపు, వేణువీణా నాదాలు మరోవైపు, మనోహరమైన నాట్యవిన్యాసాలు ఇంకోవైపు మణిద్వీప వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. స్వర్ణమణిమయ ఖచితమైన మణిద్వీపంలోని చింతామణి గృహంలో, శ్రీ చక్రం మధ్యలో, రక్తవస్త్రాలను,ఎరుపురంగులో ఉన్న కస్తూరికాది లేపనాలను ధరించి, మంగళాకరమైన పర్యంకంపై భువనేశ్వరీమాత భువనేశ్వరుడితో కలిసి అతని వామభాగంలో కొలువుదీరి ఉంటుంది. ఆవిడే ఆదిశక్తి.
భువనేశ్వరిగా, త్రిపుర సుందరిగా కొలువుదీరిన అమ్మవారి పర్యంకానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఈశ్వరుడు నాలుగు కోళ్లుగా ఉంటారు. సదాశివుడు పలకరూపంలో ఉంటాడు. ఆమె కటాక్ష జనితాలై విజ్ఞానం, ఆనందం అనే నదులు, నవనిధులు, అష్టసిద్ధులు ప్రవహిస్తుంటాయి. సూర్యాగ్ని చంద్రులు ఆమెకు కన్నులుగా వెలుగొందుతూ ఉంటారు. కాళి, కాత్యాయని, వారాహి, చాముండాది దేవతలు గణాధ్యక్షులుగా ఉంటారు. మహదహంకారాదులు, పంచభూతాలు, కాలం ఆమె తత్త్వాలుగా చేతనాచేతనమైన సకల విశ్వాన్ని రక్షిస్తుండగా… చిరునవ్వుముఖంతో, కారుణ్యపూరితమైన చూపులతో దర్శనమిస్తుంటుంది ఆదిశక్తి. పాశాంకుశ వరాభయ హస్తాలతో, వర్ణనాతీత శారీరక కాంతులతో అలరారుతూ ఉండే ఆమెను లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి మొదలైన కాంతులు సేవిస్తుంటాయి. అమ్మవారు కొలువై ఉన్న ఈ చింతామణి గృహం ప్రళయకాలంలో సంకుచితమై తిరిగి వర్ధిల్లుతూ ఉంటుంది. మణిద్వీపం చుట్టూ కాంస్యం, తామ్రం, సీసం, ఇత్తడి, పంచలోహాలు, పుష్యరాగం, పద్మరాగం, గోమేధికం, వజ్రం, వైడూర్యం, ఇంద్రనీలం, మరకతం, ప్రవాళం, మాణిక్యం మొదలైన ప్రాకారాలు ఉంటాయి. చింతామణి గృహం సూర్యకాంత, చంద్రకాంత మణులతో నిరంతరం ప్రకాశిస్తుంటుంది.
ఆమె సంకల్పంతో ఈ చరాచర సృష్టి జరిగింది. మొదట నిరాకార, నిర్గుణ ‘నిష్కళ’ స్థితి నుంచి సంకల్పం.. శక్తి సంకల్పాల నుంచి చైతన్యం, దాని ద్వారా మనసు, బుద్ధి శరీరాలు ఆవిర్భవించి సగుణమూర్తిగా భాసించాయి. శక్తి నుంచి శారీరక బలం, సౌభాగ్యాలు.. చైతన్యం ద్వారా తెలివి, స్ఫూర్తి, ఎరుక (ఆధ్యాత్మిక జ్ఞానం)లు వెలుగుచూశాయి. తర్వాత ఆ శుద్ధ చైతన్యమే శివశక్తులు (చైతన్యశక్తులు)గా వస్తుప్రపంచమై అనంత సృష్టి వెలుగు చూసింది. ఈ అనంతశక్తిని శరీరంలో ఉంటే కుండలినిగా, వస్తువులలో విద్యుత్తుగా, లోకాలలో ఆకాశంగా వ్యవహరిస్తాం.
నిజానికి మన దేహమే మణిద్వీపం. దేహంలోని హృదయం దహరాకాశం. కాశం అంటే వెలుగు. విశిష్టమైన వెలుగే ప్రకాశం. అజ్ఞానపు చీకటిని తొలగించే జగన్మాత మన దేహంలో సూక్ష్మంగా ప్రకాశిస్తుంటుంది. తెలుసుకోగలిగితే ఆ మంత్రరూపిణి మన మనసులోనే కొలువై ఉన్నది. లోకం అంటే మనసు. మనసును దాని పరిమితులలో నిలిపి అమితమైన చైతన్యాన్ని కలిగించేది మంత్రం. మంత్రాన్ని నియమిత అంతరాలలో మననం చేయడం వల్ల అది మనల్ని కాపాడుతుంది.
ఈ మణిద్వీపాన్ని తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిర్రుతి, పశ్చిమంలో వరుణుడు, వాయవ్యంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో రుద్రుడు వారివారి పరివారాలతో నిలిచి అప్రమత్తులై రక్షిస్తుంటారు. అలా వైభోగప్రదాయిని అయిన అమ్మను సేవించిన వారికి ప్రశాంతత, సంతృప్తి కలుగుతాయి. జీవిత ప్రయోజనాలు సిద్ధిస్తాయి. జీవన గమనంలో ఎదురయ్యే అడ్డంకులు, దిగులు, అనారోగ్యాలు, అకాల మరణాలు తొలగిపోతాయని వేదవ్యాసుడు పేర్కొన్నాడు. మణిద్వీపవాసిని అయిన అమ్మను సేవించి మనమూ ఆ ఫలితాన్ని పొందుదాం.
– పాలకుర్తి రామమూర్తి
బాసర ఒక్కటే కాదు.. తెలంగాణలో ఉన్న ఈ సరస్వతీ దేవాలయాల గురించి తెలుసా !!”
“దసరాకు ఏ రాష్ట్రం ఎన్ని రోజులు సెలవులు ఇస్తుందో తెలుసా!!”
ముంబై, కోల్కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
dussehra | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో వస్త్రంలో ఎందుకు దర్శించుకోవాలి?