కాలానికి అందనివాడు. సృష్టికి ముందున్నవాడు హయగ్రీవుడు. బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి వేదాలు అవసరం. ఆ వేదాల సంరక్షణ కోసం విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవుడిగా అవతరించాడు. తెల్లని రూపం వాడు, జ్ఞాన-అజ్ఞానాల్ని తేటతెల్లం చేసే చల్లని దేవుడు హయగ్రీవుడు.
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే॥
‘అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవుడికి నమస్కరిస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం. ఎవరీ హయగ్రీవుడు? ఎందుకు ఆయన్ను ఉపాసించాలి?
శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి వేదాలను ఉద్ధరించారు. అందువల్ల, వేదాలతోపాటు సమస్తమైన వాఙ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యాడు. ఈ అవతారంలో స్వామి గుర్రం ముఖం, మానవ శరీరం కలిసిన రూపంలో దర్శనమిస్తాడు. స్వామి వామాంకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. స్వామిది తెల్లటి శరీర ఛాయ. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, చిన్ముద్ర, పుస్తకాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.
వేద రక్షకుడు
శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో హయగ్రీవ అవతారానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించి, పాతాళంలో దాచిపెడతారు. వేదాలు లేనిదే సృష్టికార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు. వెంటనే, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారంలో పాతాళానికి చేరి, మధుకైటభులను వధించి, వేదాలను రక్షించి, బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు. హయగ్రీవుడు పరిపూర్ణ వేదమూర్తి. స్వామి రూపం సకల విద్యలకు నిలయంగా భాసిస్తుంది. అంతేకాదు, హయగ్రీవుడు సకల దేవతాస్వరూపం కూడా. ఆయనవల్లనే ఈ లోకానికి లలితా సహస్రనామం, దుర్గా త్రిశతి మొదలైన విద్యలు అందాయి. సాక్షాత్తు హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి శక్తి ఉపాసనా రహస్యాలను బోధించినట్లు బ్రహ్మాండ పురాణంలో ఉంది.
అంతేకాదు, సకల మంత్రతంత్రాలకు సైతం హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండాది పురాణాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. మహోన్నత అవతారమూర్తి అయిన హయగ్రీవస్వామిని అర్చించిన ఎందరో రుషులు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన ఆదిశంకరులు, విశిష్టాద్వైత మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవ ఉపాసనతో సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారని చెబుతారు. హయగ్రీవ ఉపాసన పుణ్యఫలితం వల్ల శ్రీపాద రాజతీర్థులనే పండితుడు రాజాస్థానంలో జరిగిన పండిత సభలో విజయం సాధించాడు. దుష్టమంత్ర ప్రభావం వల్ల శ్రీపాదుడికి కలిగిన వాగ్బంధనం కూడా హయగ్రీవ ఉపాసన వల్ల తొలగిపోయింది. గాలవుడనే మహర్షి హయగ్రీవ ఉపాసనతో వేద పారంగతుడు అయ్యాడని మహాభారతం చెబుతున్నది. సూర్యుడు సహా దేవతలందరూ హయగ్రీవుడి ఉపాసన చేసినట్లు హయగ్రీవ ఉపనిషత్ చెబుతున్నది.
…? విష్ణువర్ధన్