శుకుడు పరీక్షిత్తుతో.. పాండవేయా! దాయాదులైన దానవుల వలన తన తనయులు ఆఖండా (ఇంద్రా)దులకు కలిగిన దుర్గతిని తలచి దేవమాత అదితి అనాథ వలె అలమటిస్తోంది. ఒకరోజు కశ్యపుడు వేడుకలు లేక వెలవెల పోతున్న తన ఇల్లాలు అదితి ఆశ్రమానికి వచ్చాడు. వాడిన ఆవిడ వదన వారిజాన్ని- ముఖ పద్మాన్ని చూసి, చేరదీసి, చిబుకం- గడ్డం పట్టుకొని ఓదార్చాడు. తనను ఊరడించిన పతిదేవుని అదితి తన కుమారుల కష్టాలు తొలగిపోయే ఉపాయం ఆలోచించమని అర్థించింది. ప్రజాపతి మొదట తన సతి అదితిని ధర్మశాస్త్రపరంగా ఇలా ప్రశ్నించాడు.. సుదతీ! శిష్టులు, బ్రహ్మనిష్ఠులైన విప్రులను ఇష్టంతో సేవిస్తున్నావు కదా? దేవాలయాలలో ధూప, దీప, నైవేద్యాది ఉపచారా (అర్చన)లకు అపచారాలు జరగడం లేదు కదా? నీ పుత్రులు ధర్మాన్ని పాటిస్తున్నారా? అతిథి అభ్యాగతులను అర్ఘ్యపాద్యాలిచ్చి అన్నపానాలతో ఆదరిస్తున్నావా? ఏమరక యాచకులను, సేవకులను, సజ్జనులను సత్కరిస్తున్నావా?
ఆ॥‘అన్నమైనఁ దక్రమైనఁ దోయంబైన
శాకమైనఁదనకు జరుగు కొలఁది
నతిథి జనుల కడ్డమాడక యిడరేని
లేమ! వారు కలిగి లేని వారు!’
‘అదితీ! అన్నమైనా, మజ్జిగైనా, లేదా ఏదో కూరో నారో అయినా, కాక కనీసం తాగడానికి మంచినీరైనా- తమకు ఉన్నంతలోనే కొంచెమైనా అతిథులకు లేదనకుండా పంచిపెట్టాలి. అలా పెట్టకపోతే ఎంత ఉన్నవారైనా వారు దరిద్రులే- లేనివారే!’
మూలంలో ‘నార్చితాః సలిలైరపి’ (కనీసం పేయజలం- మంచినీళ్లతోనైనా పూజించకపోతే) అని మాత్రమే ఉన్నదానికి- గృహస్థ ధర్మాలలో ప్రశస్తమైన ‘దాన శీలత’ అనే గుణానికి సానపెడుతూ, ఊతమిస్తూ పలికిన ఎంతో పూతమైన పై ఆటవెలది పద్యం పోతన గారి నూతన సాహితీ నైవేద్యం! ‘నాన్నోదక సమం దానం’- అన్ని దానాల కన్నా ‘అన్న జల’ దానం మిన్న. ఈ మహీ మండలం- మన్నులో ఉన్న అన్ని రత్నాలలో మున్ముందుగా ఎన్నదగినవి మూడే మూడు- జలం, అన్నం, సూక్తి- సుభాషితం! ప్రాణుల మనుగడకు ఏడుగడ (రక్షకం) అయిన ఈ మహారత్న త్రయం విలువ గుర్తించని మూర్ఖుల చేత మాత్రమే రకరకాల రాతి ముక్కలు జాతిరత్నాలుగా- మహార్ఘమైన మణిమాణిక్యాలుగా లోకంలో చెలామణి అవుతున్నాయి. ‘లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మింగబోడు’ గదా! సమయం, సందర్భం తెలిసి సరసంగా పలుక నేర్చినవాడే పండితుడు. ఎన్నగా, నన్నయ్య గారి నానా రుచిరార్థ సూక్తి నిధి’కి సహజ పాండిత్యుడైన మన పోతన్నయే మన్నన పొందిన వారసుడు, పాలకుడు!
ప్రజాపతి పలుకులు విని అదితి ఇలా విన్నవించింది.. ‘స్వామీ! మన గృహంలో అగ్నులు, అతిథులు, పరిజనులు, యాచకులు మొదలైన వారందరి కోరికలు ఈడేరుతున్నాయి. కాని, నా పుత్రుల సంపద, వైభవం, కీర్తి, ప్రాభవం, నిలయాలను అసురులు అపహరించారు. మహానుభావా! అమరులు, అసురులు- ఇద్దరూ నీ కొమరులే. వారిని నీవు సమంగానే చూస్తావు. కాని, భగవంతుడైన శ్రీకాంతుడు సర్వుల పట్ల సముడైనా తన ఏకాంత (అనన్య) భక్తుల యెడల పక్షపాతం- ఎంతోకొంత ఎక్కువగా ప్రేమ ప్రకటించునట్లు మహాత్మా! నీవు కూడా నీ భక్తులైన ఇంద్రాది దేవతలను అనుగ్రహించు.’ కశ్యపుడు జ్ఞానదృష్టితో కొంతసేపు చింతించి అదితి పుత్రవ్యామోహాన్ని తొలగించడానికి చిరునవ్వు చిందిస్తూ వేదాంత ధోరణిలో ఇలా అన్నాడు..
మ॥ ‘జనకుండెవ్వఁడు? జాతుఁడెవ్వడు? జని స్థానంబు లెచ్చోటు? సం
జననం బెయ్యది? మేనులే కొలది? సంసారంబు లే రూపముల్?
వినుమా యింతయు విష్ణుమాయ దలఁపన్ వేరేమియుం లేదు, మో
హ నిబద్ధంబు నిదానమంతటికి జాయా! విన్నఁబో నేటికిన్?
‘దేవీ! పితరుడెవడు? పుత్రుడెవడు? పుట్టిన ప్రదేశాలు ఏవి? అసలీ పుట్టుక ఏమిటి? దీని గుట్టు ఏమిటి? అనాత్మ అయిన ఈ శరీరాలు ఏ పాటివి? అసారములైన ఈ సంసారాలు ఏ మాత్రమైనవి? విచారిస్తే ఇదంతా దాటగరాని విష్ణుమాయ తప్పవేరేమీ కాదుగా? మోహపాశమే- అజ్ఞానంతో బంధింపబడి ఉండటమే దీనికి మూల కారణం. కాన, ఓ శుభాంగీ! జరిగిన దానికి ఇంతగా కుంగిపోవడం దేనికి?’ అయినా, అడిగావు కనుక చెపుతా.. విను… ‘ఏ విధమైన అప్రియం, అపాయం తొలగాలన్నా భగవదారాధనే సర్వోత్తమ ఉపాయం. ఓ ముద్దుగుమ్మా! భగవద్భక్తి వమ్ముకానిది. నమ్మకముంచి ఏకాగ్ర చిత్తంతో ‘పయో భక్షణ’ వ్రతం ద్వారా కరుణా పారావారుడు (దయాసాగరుడు), నారాయణుని ఆరాధించు’- అని వ్రతవిధానం కూడా వివరించాడు. ‘పయోభక్షణ’ వ్రతమనగా క్షీరం (పాలు) మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ
ఆచరించాల్సిన వ్రతం. పరమార్థంలో ‘పయస్సు’ (పాలు) అనగా సత్తగుణం. ‘సత్తాత్ సంజాయతే జ్ఞానం’ (గీత). సతత- నిరంతర సత్తగుణ సేవనం తత్తజ్ఞాన ప్రాప్తికి సాధనం. అదితి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పన్నెండు దినాలు యథావిధిగా పరమాత్మను పూజించింది.
వ్రతం సమాప్తం కాగానే నియతవ్రత- నియమవంతురాలైన అదితికి సువ్రతుడు, సుముఖుడు, సూక్షుడు అయిన భగవంతుడు చతుర్భుజ శోభితుడై, పీతాంబరధారియై ప్రత్యక్షమయ్యాడు. పరమాత్మ దర్శనంతో అదితి శరీరం పులకించింది. ఆనంద బాష్పాలతో వక్షఃస్థలం తడిసిపోయింది. ఆదిదేవుని రూపాన్ని చూపులతో తనివీతీరా తాగింది. ఎట్ట ఎదుట నిలిచిన స్వామికి నుదుట చేతులు జోడించి, నమస్కరించి, పట్టరాని ఆనందంతో కుదుటపడ్డ మనసుతో- మృదుమధుర వాక్కులతో శ్రీపతిని సన్నుతి చేసింది… వినుత మందారా! గుణహార! వేదసారా! ప్రణత వత్సల! పద్మాక్ష! పరమపురుష!- (శేషతల్ప శయనా! నీవు భక్తులకు కల్పవృక్షానివి. సుగుణ నిధివి. వేదాలకు సారమైనవాడవు. కొలిచేవారికి కొంగు బంగారానివి. పద్మనేత్రుడవు, పరమాత్మవు!) అంటూ వినయంతో ఇలా మనవి గావించింది.. ‘తండ్రీ! బలవంతులైన శుక్రశిష్యులు అసురులు విక్రమించి నా శక్రాది (ఇంద్రుడు మొదలైన) సుతులను అదరించి, బెదరించి అమరావతిని ఆక్రమించి ఏలుతున్నారు. నాటినుంచి కన్నకడుపు కాన నా కంటికి కునుకు కరవైంది. లోకనాథా! నా కడుపు శోకం తీర్చి నన్ను కాపాడు’. అప్పుడు అచ్యుతుడు ఇలా అన్నాడు..
శా॥ ‘నీ కోడండ్రును, నీ కుమార వరులున్, నీ నాథుడున్, నీవు సం
శ్లోకింపన్ సతులుం బతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్
శోకింపన్, భవదీయ గర్భమున దేజోమూర్తి జన్మించెదన్
నాకున్ వేడుక పుట్ట నీ సుతుఁడనై నర్తించి వర్తింపగాన్’
తల్లీ! నీ కొడుకులు, కోడళ్లు, నీ నాథుడు, నీవు మెచ్చుకునేలా చేస్తాను. మీ ఆలుమగలు మళ్లీ ఆనందించేలా చూస్తాను. నక్తంచరులు- రాక్షసులు నొచ్చుకునేలా వారికి ఉచ్చుబిగిస్తాను. వారి ఆడువారి ఆభరణాలను ఊడదీయిస్తాను. ఓ అనురాగవల్లీ! నీ ఒడిలో చల్లగా ఆడుకోవాలని నాకూ వేడుకగా ఉంది. అమ్మా! నా ఆరాధన వ్యర్థం కాదు. శ్రద్ధను బట్టి ఫలం తప్పక లభిస్తుంది. నా రూపాన్ని భావిస్తూ (తలుస్తూ) నీ భర్తను భజించు- సేవించు. నేను నీ గర్భంలో అర్భకుడనై (బిడ్డనై) ఆవిర్భవిస్తా!
దర్శనమిచ్చిన విషయాన్ని గుచ్చి-గుచ్చి అడిగినా ఎవ్వరికీ చెప్పవద్దన్నాడు పరమాత్మ. ఎందుకని? దేవతలకు సంబంధించిన విషయాలు, వివరాలు, వరాలు ఎంత రహస్యంగా ఉంచితే అంత శక్తిమంతంగా, ప్రభావ సంపన్నంగా ఉంటాయి. ఇక సాక్షాత్ దేవదేవుని విషయంలో చెప్పేదేముంది? ‘మత్రి గుప్త భాషణే, గుప్తవాదే మంత్రః’- రహస్య ఆలోచన. గుప్తంగా- రహస్యంగా ఉంచుకునేదే మంత్రం. మంత్ర జప ఉపాసనలు మనసుతో గోప్యం (రహస్యం)గా ఉన్నంత వరకే వాటికి మనుగడ! అలాకాక లోక ప్రతిష్ఠకు పాకులాడితే, వచసా- మాటల్లో బహిర్గతం చేసుకుంటే వర్చస్సు కోల్పోయి అవి వారికే ఉపకరించవు. పరులకేమి ఉపయోగం? స్వవంచన, సమాజ వంచన తప్ప! అదితిని అనుగ్రహించి ఆదిదేవుడు అంతర్ధానమయ్యాడు. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006