తిరుమల : తిరుమలలో సోమవారం వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి 614వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి 22వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధాన్యమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
సోమవారం తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం 10 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం నుంచి 22 వరకు ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు సంగీత కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు.