Vaikunta Ekadashi | తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తిరుమల, యాదాద్రి ఆలయాలతోపాటు అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలు భక్తజన సంద్రంగా మారాయి. తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఏకాదశి రోజు వైకుంఠద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠద్వారం దర్శనాలను ప్రారంభించారు. ఉదయం 2 గంటల నుంచే వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకున్నారు. అనంతరం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ద్వారం దర్శనం ఈ నెల 11 వరకు అనుమతించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నది. శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ్మాస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. యాదాద్రిలో తొలిసారిగా స్వామిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో వచ్చారు. ఉదయం 6.48 గంటల నుంచి భక్తులకు స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామిని దర్శించుకున్నారు. అటు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ్మాస్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వారం దర్శనాలు ప్రారంభించారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.