ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన కళాఖండం. అణువు నుంచి బ్రహ్మాండం వరకు, గడ్డిపోస నుంచి గ్రహాంతరాల వరకు అంతటా వ్యాపించి ఉన్న వైవిధ్యం మనల్ని విభ్రమకు గురిచేస్తుంది. ఈ అపారమైన వైవిధ్యమే ఈశ్వర సృష్టిలోని పరమార్థాన్ని, ఆయన అనంత శక్తిని చాటిచెబుతుంది. భగవంతుడి సృష్టిలో ఏ రెండు వస్తువులూ ఒకేలా ఉండవు. ఒకే చెట్టుకు కాసిన వేలాది ఆకుల్లో కూడా ఒకదానికొకటి పోలిక ఉండదు. లక్షలాది రకాల పక్షులు, జంతువులు, జలచరాలు.. ఒక్కో దానికి ఒక్కో రకమైన రూపం, స్వరం., స్వభావం. గాలి స్పర్శను ఇస్తుంది, నీరు దాహాన్ని తీరుస్తుంది, అగ్ని వెలుగునిస్తుంది. ఈ వైవిధ్యమే భూమిపై జీవం నిలవడానికి ఆధారం.
కోట్లాది మంది జనాభా ఉన్నప్పటికీ, ఒకరి వేలిముద్రలు మరొకరితో కలవవు. ఇది భగవంతుని అద్భుతమైన ‘ఇంజనీరింగ్’, రంగు, ఎత్తు, ముఖ కవళికలలో వైవిధ్యం. ఆలోచనలు, ఇష్టాయిష్టాలు, ప్రతిభలో భేదం. సృష్టిలో ప్రతి మనిషీ ప్రత్యేకమైన వారే. భగవంతుడు ఎవరినీ నకలుగా సృష్టించలేదు. ప్రతి ఒక్కరూ ఒక అసలైన సృజనే. పైకి ఇన్ని భేదాలు కనిపిస్తున్నప్పటికీ, వాటన్నిటినీ నడిపించే సూత్రం ఒక్కటే. అది చైతన్యం లేదా ఆత్మ. నగల్లో బంగారం ఎలాగైతే అంతర్లీనంగా ఉంటుందో,
మట్టి పాత్రల్లో మట్టి ఎలాగైతే ప్రధానమో, అలాగే భిన్న రూపాల్లో ఉన్న ఈ సృష్టి అంతటా ఆ ఈశ్వర సృష్టిలోని వైవిధ్యాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇంతటి అనంతమైన సృష్టిలో మనం ఒక చిన్న రేణువు లాంటి వారం అని తెలుసుకున్నప్పుడు వినయం కలుగుతుంది.
మనకంటే భిన్నంగా ఉన్న వ్యక్తులను, పరిస్థితులను గౌరవించడం నేర్చుకోవాలి. వైవిధ్యం అంటే విభేదం కాదు, అది ఒక అందం. మన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని, ప్రకృతిని చూసి ఆ సృష్టికర్తకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
వైవిధ్యం అనేది సృష్టి అందం. ఒకే రకమైన రంగుతో చిత్రం గీయలేం, ఒకే రాగంతో సంగీతాన్ని సృజించలేం. భిన్న రకాల పువ్వులు కలిసి ఒక అందమైన మాలను ఎలా తయారు చేస్తాయో, భిన్నత్వంలో ఉన్న వ్యక్తులు, ఆలోచనలు కలిసినప్పుడే ఈ విశ్వం సంపూర్ణమవుతుంది. ఈ వైవిధ్యమే మనకు సహనాన్ని, పరస్పర గౌరవాన్ని నేర్పిస్తుంది.
ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం ఈ ఏకత్వాన్ని అనుభూతి చెందవచ్చు. ఇతరులలోనూ దైవాన్ని చూడటం ద్వారా స్వార్థం తొలగిపోతుంది. ‘నేను‘ అనే అహంకారాన్ని వీడి, సర్వమూ బ్రహ్మమయమని (సర్వం ఖల్విదం బ్రహ్మ) గ్రహించడం. షరతులు లేని ప్రేమ ద్వారా హృదయాలు కలిసిపోతాయి. అక్కడ భేదాలకు తావుండదు. వైవిధ్యంలో ఏకత్వం అనేది కేవలం ఒక నినాదం కాదు, అది ఒక జీవన సత్యం. ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ ఏకైక పరమాత్మను దర్శించాలి. అప్పుడే ద్వేషం నశించి, విశ్వశాంతి సాధ్యమవుతుంది. ‘సమత్వమే యోగం’ అంటే అందరినీ, అన్నింటినీ సమానంగా చూడటమే నిజమైన ఆధ్యాత్మిక యోగం. ‘లోకాః సమస్తాః సుఖినోభవంతు’ అంటే అందరూ, అన్ని జీవరాశులు బాగుండాలని కోరుకోవడమే ఈ వైవిధ్య భరిత సృష్టి పట్ల మనం చూపే గౌరవం.
-తరిగొప్పల వీఎల్ఎన్ మూర్తి ,80085 77834