శ్రీశైలం: శ్రీశైలంలోని (Srisailam) శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు మహోత్సవాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 3న ఈ ఉత్సవాలు ముగుస్తాయి. బుధవారం ఉదయం 9.15 గంటలకు వేదపండితులు ఉగాది ఉత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునుడికి విశేష అర్చనలు నిర్వహించనున్నారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలవుతాయి. శక్తిస్వరూపిణి మహాలక్ష్మి అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామి, అమ్మవార్లకు భృంగివాహన సేవ, మహాలక్ష్మి అలంకారం చేయనున్నారు. 31న కైలాసవాహన సేవ, మహాదుర్గ అలంకారం, ఏప్రిల్ 1న నందివాహన సేవ, మహాసరస్వతి అలంకారం, ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక వచ్చేనెల 2న పంచాంగ శ్రవణం, రథోత్సవం, అమ్మవారికి రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం, 3న అశ్వవాహన సేవ, భ్రమరాంబాదేవి నిజాలంకరణతో ఉత్సవాలు ముగియనున్నాయి.