శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ఐదు రోజుల పాటు నేత్రపర్వంగా సాగాయి. చివరి రోజు ఆదివారం చండీశ్వరస్వామికి షోడషోపచార క్రతువులు నిర్వహించారు. అనంతరం ఈవో లవన్న ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, సభ్యులు రుద్రహోమం, జయాధి హోమాల పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు జరిపించారు.
ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్త్రోక్తంగా అవబృదస్నానం చేయించి, వసంతోత్సవాన్ని నిర్వహించారు. అవబృదంలో భాగంగా చండీశ్వరున్ని ఆలయ మాఢవీధుల గుండ ఆలయ పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి.. వేదమంత్రాలతో పంచామృతాలు, శుద్ధజలాలతో సహస్రధార చక్రస్నానం చేయించారు. అనంతరం పుష్కరిణిలో స్వామివారిని తలపై ధరించి పుణ్యస్నాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.