శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం కుమారస్వామికి ప్రత్యేక అభిషేకం, సాయంత్రం ప్రదోషకాలంలో క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకం, పుష్పారచ్చనలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధాన ఆలయంలో నందిమండపంలో శనగల బసవన్నకు ఈవో శుద్ధోదకాలు, ఫలోదకాలతో అభిషేకించి షోడశోపచార పూజలు చేశారు. అనంతరం నందీశ్వరుడికి శనగలను నైవేద్యంగా సమర్పించారు.