TTD | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ ఈ నెల 19న ఉదయం గంటల ప్రారంభమవుతుందని పేర్కొంది.
21వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్లో టికెట్ల పొందిన భక్తుల జాబితా విడుదల చేయనున్నది. లక్కీడిప్లో టికెట్ల పొందిన వారు డబ్బులు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. ఇక కల్యాణం, ఆర్జిత బ్రహోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న విడుదల ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు దేవస్థానం బోర్డు పేర్కొంది.
శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లను 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నది. అంగప్రదిక్షణం టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, గదుల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చెప్పింది. మే నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగులు, దర్శన టికెట్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.
మే మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ల విడుదల చేయనున్నట్లు పేర్కొంది. అలాగే తిరుమలతో పాటు తిరుపతిలో వసతి గదుల బుకింగ్ను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది. ఈ విషయాన్ని గమనించిన భక్తులు ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకొని సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.