తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేయనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, భక్తులు ఆయా సేవలు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దర్శనాల సంఖ్యను పెంచుతూ వచ్చిన టీటీడీ ఇప్పుడు ఆర్జిత సేవలకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకునే వీలుంటుంది.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనవచ్చు. మార్చి 22 ఉదయం 10 గంటలకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్ల కేటాయింపు జరుగనుంది. టికెట్లు పొందినవారి జాబితాను మార్చ్ 22వ తేదీ ఉదయం వెబ్సైట్లో ఉంచుతారు. ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా కూడా సమాచారం అందిస్తారు.