TTD News | తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ అధికారులకు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ మారిముత్తు, ప్రధానార్చకులు సుందరభట్టర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తమిళ కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని 2006 నుంచి శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పిస్తున్నది. ప్రాచీన శ్రీ వైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆణివార ఆస్థానం సందర్భంగా ప్రతి ఏడాది శ్రీరంగం నుంచి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తుంటారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పార్పత్తేదార్ పీ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖ ఉత్సవాలలో ఒకటైన చక్రతీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించారు. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులమీద దక్షిణభాగంలో మహా పవిత్రమైన చక్రతీర్థం ఉన్నది. చక్రతీర్థ ముక్కోటి నాడు ఉదయం అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో ఆలయం నుంచి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళ్లారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, శ్రీ నరసింహస్వామివారికి, శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజలు చేశారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.