TTD News | బెంగుళూరు మహానగరంలో ఈ నెల 16న శ్రీనివాస కల్యాణం జరుపనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 16 న 6నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి కల్యాణం జరుగనున్నది. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
బెంగళూరు రాంనగర్ స్టేడియంలో వేదిక నిర్మాణం, విద్యుత్, పుష్పాలంకరణలు, భద్రత ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. స్వామి కల్యాణం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనునన కార్యక్రమాల పై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసు అధికారులతో చర్చించి అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బ్యారికేడ్లు, వీఐపీల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భక్తులు కూర్చునేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. జేఈఓ సమీక్షలో ఎస్ఈ జగదీశ్వర రెడ్డి, వీజీఓ మనోహర్, డీఈ రవిశంకర్ రెడ్డి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, శ్రీనివాస కల్యాణం దాత, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రతినిధి అశ్విన్, బెంగుళూరు పోలీసు అధికారులు పాల్గొన్నారు.