TTD News | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. 21న ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరించనున్నారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు బంగారు రథంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఆ తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. 23న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో పాటు సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు. ఉత్సవాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి, అమ్మవార్త ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం జరుగుతంది. వసంత ఋతువులో మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడంతో పాటు వివిధ ఫలాలను నివేదిస్తారు. వసంతోత్సవం సందర్భంగా 23న అష్టదళ పాదపద్మారాధన, 21 నుంచి 23 వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.