తిరుమల: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) ప్రయాగ్రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనాన్ని (Tirumanjanam ) టీటీడీ ఘనంగా నిర్వహించింది.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజనాన్ని పవిత్ర గంగా నది ( Ganga River ) ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, మొదలైన పంచ సూక్తాలను అర్చకులు పఠించారు. అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు.
సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్ ను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు.