Pushpa yagam | తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామికి పుష్పయాగం ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. సాలకట్ల బ్రహ్మోత్సవాల తర్వాత మరోసారి భక్తులను కనువిందు చేయడానికి పుష్పయాగ మహోత్సవం సిద్ధమవుతున్నది. పుష్పయాగాన్ని చూసి తరించేందుకు భక్తులు ఇప్పటినుంచే తిరుమల వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 15వ శతాబ్దం కాలం నుంచి శ్రీవారికి ఈ పుష్పయాగ మహోత్సవాన్ని జరిపించే వారని శాసనాల ద్వారా తెలుస్తున్నది. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడో రోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెప్తున్నది.
కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 1 వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి దాదాపు 7 టన్నుల పువ్వులను దాతలు విరాళంగా అందించనున్నారు. పుష్పయాగం టిక్కెట్లు ఈ నెల 10 వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నారు. రూ. 700 ఆర్జిత సేవ టిక్కెట్ తీసుకున్న భక్తులను కల్యాణోత్సవ మండపంలోకి పుష్పయాగం అనంతరం దర్శనానికి పంపుతారు. జయ విజయుల దగ్గర నుండి స్వామి దర్శనం ఉంటుంది.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి హృదయాన్ని తాకేవరకు పుష్పార్చన చేస్తారు.