Tirumala Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి బకాసురవధ అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
ముత్యాలు నిర్మలకాంతులు వ్యాపించేందుకు.. ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుంచి విడుదలై మోక్షాన్ని పొందుతుంది.
ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
ఉత్సవాల్లో ఉదయం స్వామివారి సింహ వాహనసేవలో మలయప్పస్వామి యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది.