Tirumala Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజు స్వామివారు సరస్వతీ అలంకారంలో హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా వాహనసేవ ముందు కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. హంస వాహనసేవలో మలయప్పస్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక.
అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తుల్లో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవలో పెదజీయర్స్వామి, చినజీయర్స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహకిశోర్ పాల్గొన్నారు.