కాపవ్యుడు ఒక బోయవాడు. పారియాత్రాచలంలో కుటుంబంతో ఉంటుండేవాడు. తల్లిదండ్రులను భక్తిశ్రద్ధలతో చూసుకునేవాడు. అడవిలో ఉండే మునులకు కందమూలాలు, పండ్లు తదితర ఆహార పదార్థాలు సమకూర్చేవాడు. విలువిద్యలో నేర్పరి. పైగా పరాక్రమవంతుడు. ఎంతటివారినైనా ఒంటిచేత్తో ఓడించగల సామర్థ్యం కాపవ్యుడి సొంతం. అతని సాహసాల గురించి కథలు కథలుగా చెప్పుకొనేవారు. అవి విని ఆ ప్రాంతాల్లో ఉండే దొంగలు ఒకరోజు కాపవ్యుడిని కలిశారు. అతణ్ని తమ జట్టుకు నాయకుడిగా ఉండమని వేడుకున్నారు. వారి కోరికను అంగీకరించడానికి అతను కొన్ని నిబంధనల్ని వారి ముందుంచాడు.
శిశువులు, మునులు, స్త్రీలను చంపకూడదు. అబలల్ని చెరపట్టి హింసించరాదు. గో బ్రాహ్మణులను సంకట పెట్టరాదు. భర్తను చంపి, స్త్రీలను వైధవ్యానికి గురిచేయరాదు… ఇలా తన నియమాల్ని కచ్చితంగా వారికి తెలియజేశాడు. వారంతా సరే అంటూ అతని నాయకత్వానికి అంగీకరించారు. కాలక్రమేణా వారి మనసు, ప్రవర్తన మారి సద్గుణవంతులు అయ్యారు. కాపవ్యుడు కూడా తనను తాను ఉద్ధరించుకున్నాడు. మహాభారతంలో భీష్ముడు చెప్పిన ఈ కథ.. పరిణామ క్రమం ద్వారా వ్యక్తిత్వ వికాసం మాత్రమే కాక, సామాజిక ఉద్ధరణ జరుగుతుందని నిరూపిస్తుంది.
…?టి.వి.ఫణీంద్రకుమార్