Bhagavad Gita | ఓ ఊర్లో ఒక పండితుడు ఉండేవాడు. అతను ప్రతి ఆదివారం సమీప గ్రామాలకు వెళ్లి గీతా పారాయణం చేసేవాడు. గ్రామస్థులు దాన్ని ఆసక్తిగా వినేవారు. ఆయన చెప్పే విధానానికి మంత్రముగ్ధులు అయ్యేవారు. ప్రతీ వారం పారాయణానికి వెళ్లడానికి ముందు ఆ పండితుడు భగవద్గీత చదువుకొని మరీ వెళ్లేవాడు. దీన్ని గమనించిన పండితుడి కొడుకు ఓసారి ‘ఏండ్లుగా గీతాపారాయణం చెబుతున్నారు కదా నాన్నగారు! ఆ గ్రంథంలో శ్లోకాలన్నీ మీకు కంఠతా వచ్చు కదా! మరి ఎందుకు ప్రతిసారీ పుస్తకాన్ని పరిశీలిస్తారు?’ అని ప్రశ్నించాడు. అందుకు పండితుడు నవ్వి ‘నాయనా! గీతలో లేని విషయం లేదు.
ఎన్నిసార్లు చదివినా ప్రతి శ్లోకం నాకు కొత్త భాష్యాన్ని చెబుతుంది. ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఏదో కొత్త రహస్యం గోచరిస్తుంది. ఈ కారణంగానే గ్రామాలకు వెళ్లిన ప్రతిసారీ చదువుతుంటాను. నేను తెలుసుకున్న విషయాలను గ్రామస్థులకు వివరిస్తుంటాను’ అన్నాడు. తండ్రి సమాధానానికి ఆశ్చర్యపోయిన కొడుకు భగవద్గీత చదవడం ఆరంభించాడు. మళ్లీ మళ్లీ చదవుతూ అందులోని లోతు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ‘గీత ఒకసారి చదివి వదిలేసే పుస్తకం కాదు! నిరంతరం చదవాల్సిందే. అప్పుడు కానీ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేం’ అని తెలుసుకున్నాడు.