శుకో ముక్తో వామదేవోపి ముక్తః
తాభ్యాం వినా ముక్తిభాజో న సంతి
శుక మార్గం యేనుసరంతి ధీరాః
సద్యో ముక్తాస్తే భవంతీహ లోకే
(వరాహోపనిషత్ 4- 34)
ఉపనిషత్ వాక్యం శుకుడు, వామదేవుడు ముక్తులు. శుకునిది సద్యోముక్తి. వామదేవునిది క్రమముక్తి. తక్షణమే కలిగేది సద్యోముక్తి. అనేక జన్మలు కష్టపడితే కలిగేది క్రమముక్తి. సద్యోముక్తికి ఎంతో పరిశుద్ధమైన మనసు కావాలి. అప్పుడు ఒకే ఒక్క ఉపదేశం చాలు. క్షణంలోనే ముక్తి కలుగుతుంది.
శుకుడు వేదవ్యాసుని కుమారుడు. పరమహంస. నదిలో దిగంబరంగా స్నానం చేస్తున్న అప్సరసలు శుక మహర్షి వెళుతుంటే సిగ్గుపడలేదు. ఆ వెనుకే వ్యాసుడు వెళ్తే సిగ్గుతో దుస్తులు వేసుకున్నారు. వ్యాసుడు అడిగితే ‘శుకుడికి దేహస్పృహ, స్త్రీపురుష భేద దృష్టి లేదు. ఆయన మనసు బ్రహ్మంలో లీనమైంది. మాకు సిగ్గు కలుగలేదు. కానీ, మీకింకా ఆ స్థితి రాలేదు. కాబట్టి మీరు వృద్ధులైనా మేం సిగ్గుపడాల్సి వచ్చింది’ అన్నారు. శుక మార్గానికి ఉదాహరణగా కొందరు మహనీయులు కనిపిస్తారు. తోతాపురి ఆదేశించిన తక్షణమే రామకృష్ణ పరమహంస మనసు పరబ్రహ్మంలో లీనమైంది. ఏకబిగిన మూడు రాత్రులు సమాధిలో ఉండిపోయాడు. అలాగే పరమహంస తాకినంత మాత్రాన వివేకానందుడు సమాధిలోకి వెళ్లిపోయాడు.
వామదేవుని మార్గంలోని వాళ్లు మళ్లీ మళ్లీ పుడుతూ, చస్తూ యోగం, సాంఖ్యం అనుసరిస్తూ మంచి పనులు చేసుకుంటూ క్రమంగా ముక్తి పొందుతారు. మనుషుల్లో చాలామంది ఇలాంటి వారే! ఎన్నో జన్మలకు గాని వీరికి పరిపక్వ స్థితి రాదు. సద్యోముక్తులు పొడిపొడి అగ్గిపుల్లలు అయితే, వీళ్లు తడిసిన అగ్గిపుల్లలు. ఈ రెండు మార్గాలనూ దేవుడే కల్పించాడు. శుకుడు విహంగం అంటే పక్షి. వామదేవుడు పిపీలికం… అంటే చీమ. పక్షి అమాంతం గాలిలోకి లేచి చెట్టు చిటారు కొమ్మకు చేరుతుంది. చీమకు చాలా సమయం కావాలి. పట్టుదలగా పాకి చేరుకుంటుంది. కారణం వివేక వైరాగ్యాలనే రెక్కలు లేకపోవడమని ఈ ఉపనిషత్ వాక్యం ఉపదేశిస్తుంది.
– డా॥ వెలుదండ సత్యనారాయణ