కృష్ణార్జునుల చిత్తరువుల్లో ఎక్కడ చూసినా కృష్ణుడు నిలబడే ఉంటాడు. అర్జునుడు పరమాత్మ పాదాల చెంత చేతులు జోడించి మోకరిల్లి కనిపిస్తాడు. అర్జునుడు మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు కృష్ణుని శరణువేడాడు. కృష్ణుడు.. అర్జునుని మనసులో నుంచి రోగకారక క్రిముల వంటి భావాలను వైద్యుడిలా తొలగించాడు. అంటే భక్తుడు.. భగవంతుడిని భజించవలసి ఉంది. జీవుడు.. దేవుడిని ప్రార్థించాలి. శిష్యుడు.. సద్గురువును ఆశ్రయించాలి.
భయస్థుడు అభయప్రదాతను వెతుక్కోవాలి. శరణు వేడాలనుకున్నవాడు శరణ్యుడెవడో కనుక్కొని అతని సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, జీవుడూ, దేవుడూ ఒక్కటేనని కూర్చుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు! ముఖ్యంగా ఆధ్యాత్మికతలో ఇలాంటి వైఖరి వల్ల సాధన కుంటుపడుతుంది. దైవం సర్వోన్నతమనే భావనతో దేహీ అన్న నాడు.. పరమాత్మ అనుగ్రహం వర్షంలా కురిపిస్తాడు. “నేను’ అనే దేహబుద్ధి ఉన్నంత వరకు, ‘నేను సేవకుడు’, ‘అతడు ప్రభువు’ అనే దాస్య భావం కలిగి ఉండటం మంచిది’ అని రామకృష్ణ పరమహంస తన శిష్యుడు నరేంద్రునితో అన్నమాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.