సోమవతి అమావాస్య అంటే ఏమిటి? ఆ రోజు మౌనవ్రతం పాటిస్తారు ఎందుకు?
– కె.ప్రశాంతి. కొత్తపేట
నేడు సోమవతి అమావాస్య
సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. అమావాస్యతో కూడి ఉన్న సోమవారం శివారాధనకు మరింత విశిష్టమైనదని చెబుతారు. ఈ రోజు తెల్లవారుజామునే స్నానాలు చేసి, మగవాళ్లు సూర్యుడికి తర్పణాలు సమర్పించాలి. స్త్రీలు ఉపవాసం ఉండి, సోమవతి వ్రతంలో భాగంగా మౌనం పాటిస్తారు. ఇలా చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుందని మన పురాణాలు పేర్కొన్నాయి. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరియడానికి సోమవతి అమావాస్య నాడు శివపార్వతులను ఆరాధిస్తారు. రావి, వేప కలిసి ఉన్న దగ్గర దీపాన్ని వెలిగించి, చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తారు.
దక్ష యజ్ఞం సందర్భంగా శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రుడు యజ్ఞానికి హాజరైన వారందరినీ గాయపరుస్తాడు. ఆ సమూహంలో గాయాలపాలైన చంద్రుడు శివుడిని ప్రార్థించగా సోమవతి వ్రతాన్ని అనుగ్రహించాడని శివపురాణ గాథ. చంద్రుడు భక్తిగా సోమవతి వ్రతాన్ని ఆచరించి శివుడి అనుగ్రహం పొందాడు. ఈ వ్రతాన్ని చేసిన వారికి శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. అవకాశం ఉన్నవాళ్లు ఈ రోజు నదిలో స్నానం ఆచరించి, నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందని వ్యాసుడు పేర్కొన్నాడు.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370