TTD news | తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయకస్వామి, శ్రీ చంద్రశేఖరస్వామి తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామి, శ్రీ చంద్రశేఖరస్వామి కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
రెండో రోజు శ్రీ సుబ్రమణ్యస్వామి ఐదు చుట్లు, మూడో రోజు శ్రీ సోమస్కందస్వామి ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మ ఏడు చుట్లు, ఐదో రోజు శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథితోపాటు పలువురు అధికారులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.