TTD news | తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. శ్రీ సోమస్కందస్వామి తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సోమస్కందస్వామి కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతున్నది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముందుగానే టిక్కెట్లు జారీ చేయడంతో భక్తులు సులభంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతున్నది. ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో 10 రోజుల పాటు వీఐపీ సీఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది.
తిరుమలకు వస్తున్న భక్లులకు అన్ని సౌకర్యాలను టీటీడీ బోర్డు కల్పిస్తున్నది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు మంచినీరుతో పాటు అన్న ప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నది. మంగళవారం తిరుమల శ్రీవారిని 71,924 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,771 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లని బోర్డు తెలిపింది.