బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుడి పట్ల తెలంగాణ ప్రజానీకానికి అపారమైన భక్తి. యాదగిరి గుట్ట నర్సన్న కులవేలుపు అయితే.. తిరుపతి వెంకన్న ఇలవేలుపు. ఏడాదికోసారైనా ఏడుకొండలు ఎక్కకపోతే.. తలనీలాలు సమర్పించుకోకపోతే, వస్తూ వస్తూ సంచినిండా లడ్డూ ప్రసాదాలు తీసుకురాకపోతే.. మనసు మనసులో ఉండదు. నిజానికి ఈ అనుబంధం ఇప్పటిది కాదు. ఒకానొక సమయంలో గోల్కొండ సుల్తానుల పాలన తిరుపతి కొండ వరకూ విస్తరించింది.
గద్వాల సంస్థానాధీశులు స్వామివారికి విలువైన ఆభరణాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. నేటికి కూడా గద్వాల నుంచి ఓ నేతన్నల కుటుంబం తిరుమల బహ్మోత్సవాలకు జోడు పంచెలు తీసుకెళ్తుంది. ఆనంద నిలయ ఆవరణలోని రెండో ప్రవేశ ద్వారానికి హైదరాబాద్కు చెందిన ద్వారక దాస్ పరభణీ అనే భక్తుడు వెండి రేకులతో తాపడం చేయించాడు. కాబట్టే ఆ ద్వారానికి వెండి వాకిలి అనే పేరు వచ్చింది. స్వామిని సేవించి తరించిన నారద, తుంబుర, కుబేరాది పరమ భక్తుల వరుసలో తానూ నిలవాలనే తపన కావచ్చు. ద్వారక దాస్.. ఇంగ్లిష్, హిందీ భాషలలో తన పేరు వేయించుకున్నాడు వినమ్రంగా ఓ పక్కన. తెలంగాణ.. శ్రీనివాస భక్తి ఉద్యమానికి కూడా మూలకేంద్రమే.
బాలాజీ కొలువైన చిలుకూరు క్షేత్రాన్ని.. రెండో తిరుమలగా పిలుచుకుంటారు. పాలకడలిలో శేష తల్పమున పవళించే స్వామిని.. హైదరాబాద్ నడిబొడ్డున బిర్లాలు నిర్మించిన పాలరాతి ఆలయంలోనూ దర్శించుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లాలోని మన్యం కొండలో స్వామి మునిజనుల కోసమే వెలిశాడని అంటారు. గద్వాల జిల్లాలోని మల్దకల్ వేంకటేశ్వరాలయమూ ప్రాచీనమైందే. శ్రీలక్ష్మి కోరికపై శ్రీనివాసుడు కాసింతసేపు సేదతీరిన కురుమూర్తి ఆలయ ఐతిహ్యం వింటేనే భక్తి భావనతో తనువు పులకరిస్తుంది. ఏడుకొండలపై బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే.. తెలంగాణలోని చాలా క్షేత్రాలలో బ్రహ్మాండ నాయకుడిని తొమ్మిది రోజులపాటూ.. తొమ్మిది అలంకారాలతో సింగారించి, అనేకానేక వాహనాలపై ఊరేగించి మురిసిపోతారు. కేశవ నామాలు నలుదిక్కులూ ప్రతిధ్వనిస్తాయి. గోవిందా.. గోవిందా!