Vaibhavostavam | హైదరాబాద్లో తిరుమల శ్రీవారి వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల కోవెలలో మాదిరిగా అన్ని కైంకర్యాలు, సేవలు నిర్వహించనున్నారు. ఇవాల్టి నుంచి ఐదురోజుల పాటు ఈ ఉత్సవాలు ఇందిరాపార్క్ వద్ద నున్న ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగనున్నాయి. తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకోలేని భక్తుల కోసం అన్ని ప్రాంతాల్లో ఇలా వైభవోత్సవాలను టీటీడీ బోర్డు నిర్వహిస్తున్నాది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.
తిరుమల ఆలయంలో మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేసిన మోడల్ ఆలయంలో కూడా ఉదయం 6 గంటలకు స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. 6.30 గంటల నుంచి గంట పాటు స్వామికి తోమాల సేవ, కొలువు చేపట్టారు. 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు అర్చన, 8.15 గంటల నుంచి 8.30 గంటల వరకు నివేదన శాత్తుమొర జరిపారు. తొలిరోజైన మంగళవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధనసేవ, వసంతోత్సవ సేవలకు అపూర్వ స్పందన లభించింది. బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు. వసంతోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది.
సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బీ రఘునాథ్ బృందం అన్నమయ్య సంకీర్తనలను చక్కగా ఆలపించారు. 2023 క్యాలెండర్లు, డైరీలతో పాటు పంచగవ్య ఉత్పత్తులను అమ్మకానికి పెట్టారు. భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉంచారు. భక్తులు ఒక్కొక్కటి రూ.50/- చొప్పున కొనుగోలు చేయవచ్చు.